ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తుంగభద్ర డ్యాంను పరిశీలించనున్న కర్ణాటక సీఎం, ఏపీ మంత్రులు - నీటి వృథా అరికట్టేలా స్టాప్‌లాగ్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు - Tungabhadra Dam Repair Works

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 7:30 AM IST

Updated : Aug 13, 2024, 7:42 AM IST

Tungabhadra Dam Repair Works: తుంగభద్ర డ్యాం మరమ్మతులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గేటు కొట్టుకుపోయిన చోట స్టాప్‌లాగ్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. నీరు పూర్తిగా వృథా కాక ముందే ఏర్పాటుకు తుంగభద్ర బోర్డు, ఏపీ, కర్ణాటక అధికారులు నిర్ణయించారు. నేడు తుంగభద్ర డ్యామ్‌ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఏపీ మంత్రులు పరిశీలించనున్నారు.

Tungabhadra Dam Repair Works
Tungabhadra Dam Repair Works (ETV Bharat)

Tungabhadra Dam Repair Works : గల్లంతైన తుంగభద్ర డ్యాం 19వ గేటు స్థానంలో స్టాప్‌లాగ్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నీటిని మరీ క్రస్టుగేట్ల దిగువకు తగ్గించకుండా అంతకన్నా ముందే స్టాప్‌లాగ్‌ ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు, ఏపీ, కర్ణాటక అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం జలాశయంలో 97 టీఎంసీల నీటినిల్వ ఉంది. గేటు కొట్టుకుపోయిన సమయం నుంచి సోమవారం రాత్రి 9 గంటల వరకు మొత్తం 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో జలాశయంలోకి సగటున 25 వేల 571 క్యూసెక్కుల వరద వస్తోంది. 19 గేట్లు ఎత్తి 99 వేల 567 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

తొలుత డ్యాం క్రస్టుస్థాయి 16 వందల 13 అడుగుల వరకు నీటిని వదిలేసి ఆ తర్వాత కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్‌లాగ్‌ ఏర్పాటు చేయాలని భావించారు. ప్రస్తుతం అలా కాకుండా క్రస్టుస్థాయి కన్నా ఎగువకు నీళ్లు ఉన్న సమయంలోనే స్టాప్‌లాగ్‌ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఇలా చేయడంతో నీటిని పూర్తిగా వృథా చేయకుండా చూడవచ్చనే భావనతో ఉన్నారు. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ సోమవారం ప్రాజెక్టును సందర్శించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.

నిర్వహణ లోపంతో కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం గేటు - రాయలసీమ రైతుల ఆశలు ఆవిరి - Tungabhadra Dam Gate Washed Away

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన కేంద్ర ఆకృతుల సంస్థ చీఫ్‌ ఇంజినీర్‌ తోట కుమార్‌ బృందం కూడా బోర్డు అధికారులతో మాట్లాడింది. కొత్త స్టాప్‌లాగ్‌ డిజైన్లు సహా ఇతర అంశాలు పరిశీలించింది. కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్లు ఏర్పాటు చేసేందుకు హొసపేటె సమీపంలోని ఓ వర్క్‌షాప్‌లో వాటి ఫ్యాబ్రికేషన్‌ సాగుతోంది. మొత్తం 5 ప్లేట్లలా తయారుచేస్తున్నారు. అందులో తొలుత మూడు ప్లేట్లు ఏర్పాటు చేస్తారు. 2 రోజుల్లో వీటి తయారీ పూర్తవుతుందని ఏపీ అధికారులు తెలియజేశారు. మూడు ప్లేట్ల ఏర్పాటు పూర్తయిన తర్వాత మళ్లీ 2 రోజుల గడువు ఇచ్చి మరో 2 ప్లేట్లతో కొట్టుకుపోయిన గేటు ఖాళీ ప్రదేశాన్ని పూర్తిగా మూసివేస్తారు.

నీటి ప్రవాహం ఉండగా స్టాప్‌లాగ్‌ ఏర్పాటుకు సాధ్యం కాకపోతే నీటిని మరింత తగ్గించి ఆ తర్వాత ప్రయత్నించాలని అధికారులు నిర్ణయించారు. డ్యాంల గేట్లు తయారీలో నైపుణ్యం ఉన్న కన్నయ్యనాయుడు జలాశయం వద్దకు చేరుకుని గల్లంతైన గేటు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో తదితర వివరాలు తెలుసుకున్న అనంతరం అధికారులతో చర్చలు జరిపారు. స్టాప్‌లాగ్‌ నిర్మాణ ఖర్చుల కోసం 5 కోట్ల రూపాయల నిధుల వినియోగానికి తుంగభద్ర పాలకమండలి అనుమతి ఇచ్చిందని మండలి కార్యదర్శి రామకృష్ణారెడ్డి తెలిపారు.

అధికారులతో సమీక్ష :నేడు తుంగభద్ర డ్యామ్‌ను మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్​పరిశీలించనున్నారు. అనంతరం డ్యామ్ గేట్ల పటిష్టత, మరమ్మతులపై అధికారులతో సమీక్షిస్తారు.

సిద్ధరామయ్య పరిశీలన : నేడు తుంగభద్ర డ్యామ్‌ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు మరమ్మతులు ప్రారంభం - Tungabhadra Dam Repair Works Start

Last Updated : Aug 13, 2024, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details