ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అందుబాటులోకి నాణ్యమైన మద్యం - రూ.99కే క్వార్టర్​ - AP Cabinet Meeting Today

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 2:35 PM IST

Updated : 19 hours ago

Andhra Pradesh Cabinet Meeting : ఏపీ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేయాలని మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు.

AP Cabinet Meeting Today
AP Cabinet Meeting Today (ETV Bharat)

Cabinet Meeting Chaired by CM Chandrababu:నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. నాణ్యమైన అన్ని మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న సగటు మద్యం ధరను 99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని 3,736 మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం (340 దుకాణాలు) కేటాయించాలనే కమిటీ సిఫార్సుకు సమ్మతి తెలిపింది. రాష్ట్రంలో 12 ప్రీమియర్‌ దుకాణాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. తిరుపతిలో ప్రీమియర్‌ దుకాణానికి అనుమతివ్వలేదు. అక్టోబర్‌ మొదటి వారంలో కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇది రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి విలేకర్లకు వెల్లడించారు.

‘కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా మద్యం దుకాణాల సంఖ్యను నిర్ణయించాం. లాటరీ విధానంలో వీటిని కేటాయిస్తాం. రిజర్వుడు దుకాణాలకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు జారీ చేస్తాం. అన్‌ రిజర్వుడు దుకాణాలకు ప్రతిపాదించే లైసెన్స్‌ ఫీజుల్లో 50 శాతమే రిజర్వుడు దుకాణాలకు ఉంటుంది. లైసెన్స్‌ ఫీజు నాలుగు శ్లాబులో రూ.50 నుంచి 85 లక్షల వరకు ఉంటుంది. ప్రాఫిట్‌ 20% మార్జిన్‌. ప్రీమియం దుకాణాలకు లైసెన్స్‌ కాలపరిమితి ఐదేళ్లు. ఫీజు రూ.కోటి. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి చర్చకు రాలేదు. ప్రైవేటు వారు వారిని తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు’ అని వివరించారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్‌ తీర్మానించింది.

రూ.204 కోట్ల లబ్ధి ఎవరికి? : పత్రిక కొనుగోలుకుగాను వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున ప్రతి నెలా ఇచ్చారు. దీనికోసం వైకాపా ప్రభుత్వంలో ప్రత్యేకంగా రెండు జీఓలు జారీ చేశారు. పత్రిక కొనుగోలుకు ఏడాదికి రూ.102 కోట్ల చొప్పున రెండేళ్లపాటు రూ.204 కోట్లు ఖర్చు చేశారు. నెల నెలా ఇచ్చే రూ.200తో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కేవలం ఒకే పత్రిక కొనుగోలు చేశారనే సమాచారం ఉంది. ఇలాంటి ఉత్తర్వులు ఎలా ఇచ్చారు? రూ.204 కోట్ల లబ్ధి ఏ పత్రికకు లేదా మీడియా సంస్థకు చేరింది? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పత్రిక కొనుగోలుకుగాను వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు రూ.200 అందించే జీఓలను ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది.

వాలంటీర్ల సర్వీసు పొడిగింపు ప్రతిపాదనకు తిరస్కృతి: 2023 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 15 వరకు గ్రామ, వార్డు వాలంటీర్ల సర్వీసులను పొడిగించాలనే ప్రతిపాదనను మంత్రిమండలి తిరస్కరించింది. వాలంటీరు వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ప్రభుత్వ శాఖలను ఇంటిగ్రేట్‌ చేస్తూ అమలుపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నివేదిక అందిన తర్వాత తగు నిర్ణయం తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. ప్రభుత్వం వాలంటీర్ల మీదనే నడుస్తోందనే విధంగా వైఎస్సార్సీపీ నేతలు ప్రచారం చేశారు. పార్టీ కార్యకర్తల కంటే కూడా వాలంటీర్లే మెరుగైన సేవలు అందిస్తున్నారనేలా వైఎస్సార్సీపీ సర్కారు వ్యవహరించింది. కానీ 2023 ఆగస్టు 15తో ముగిసిన వారి సర్వీసును పొడిగించకుండా మోసం చేసింది. వారు ఇప్పుడు సర్వీసులో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు ఇంటిగ్రేటెడ్‌ పాలసీ తీసుకురమ్మన్నారు కాబట్టి వాలంటీర్ల సేవల్ని వినియోగించుకుంటారనే భావిస్తున్నాం. అయితే ఆ అంశంపై చర్చ జరగలేదు.

రాష్ట్రానికి బిట్స్, లా యూనివర్సిటీ: అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాన్ని యూజీసీ నిబంధనల ప్రకారం డీమ్డ్‌ టు బి యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వపరంగా ఎన్వోసీ జారీ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి దేశంలో ఉన్న టాప్‌ యూనివర్సిటీలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ‘బిట్స్‌’ సంస్థను ఏర్పాటు చేయాలని బిర్లా ప్రతినిధులను ఆహ్వానించగా వారు సుముఖత వ్యక్తం చేశారు. రూ.1000 కోట్ల పెట్టుబడితో తమ అనుబంధ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు వారు ఆలోచన చేస్తున్నారు. సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యోచిస్తున్నారు. టాటా ఆధ్వర్యంలో ఉన్న ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు.

పేపర్​ లెస్ కేబినెట్ సమావేశాలు- మంత్రులకు ఐప్యాడ్​లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

పదే పదే చెప్తున్నా అలా చేయొద్దు! - మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన - CM Guidance to Ministers

Last Updated : 19 hours ago

ABOUT THE AUTHOR

...view details