ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలు - ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు - Class Room Roof Fell Down in Kadapa

Class Room Roof Fell Down in Kadapa : కడపలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా పాఠశాలలో, తరగతి గదుల నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారని గతనెలలోనే టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయినా జిల్లా విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యం వహించారు. దాని ఫలితమే మంగళవారం అదే పాఠశాల పైకప్పు పెచ్చులూడిపడటంతో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనిపై తక్షణమే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండు చేశాయి. మరోవైపు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 12:29 PM IST

Updated : Jul 3, 2024, 12:58 PM IST

Class Room Roof Fell Down in Kadapa
Class Room Roof Fell Down in Kadapa (ETV Bharat)

Students Injured Ceiling Collapse in Kadapa :కడపలోని అక్కాయపల్లిలో వైఎస్సార్సీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సాయిబాబా హైస్కూల్ నిర్వహిస్తున్నారు. పాఠశాల తరగతి గదుల ఆధునికీకరణ పేరుతో నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని గత నెల 18న కడప తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవీరెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్​రెడ్డి జిల్లా విద్యాశాఖాధికారికి, కమిషనర్​కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ చర్యలు మాత్రం శూన్యం.

ఫలితంగా మంగళవారం నిర్మాణంలో ఉన్న తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో 8వ తరగతి విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఓ విద్యార్థి సిటీ స్కాన్‌లో మెదడులో రక్తం గడ్డ కట్టి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో విద్యార్థి చేయి విరిగింది.

Kadapa Students Injured in Roof Fell Down : మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఘటన జరిగితే యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లి వారిని ఇంటివద్ద వదిలేశారు. విషయం మీడియాలో రావడంతో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘం నాయకులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తక్షణం ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్​ స్పందించడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

పెచ్చులూడిన పైకప్పు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

Case Against YSRCP MLC Ramachandra Reddy :కడప ఆర్డీవో మధుసూదన్, డీఈవో అనురాధ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని ఆర్డీవో తెలిపారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. మరోవైపు తాము ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా అధికారులు స్పందించి ఉంటే ఇపుడు ఈ ప్రమాదం జరిగేది కాదని తెలుగుదేశం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీకి భయపడి విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు.

"పాఠశాలపై కేసు పెడతామని చెప్పాము. తరగతులు నిర్వహిస్తూనే పనులు చేపట్టారు. పెచ్చులు పడి మా బాబుకు గాయాలయ్యాయి. దీనిపై డీఈఓ విచారణ జరిగి తగు చర్యలు తీసుకోవాలి. పాఠశాల యాజమాన్యం ఈ ఘటనకు బాధ్యత వహించాలి." - శివశంకర్‌ రెడ్డి, విద్యార్థి తండ్రి

తమ పాఠశాలలో జరిగిన ప్రమాదం చిన్నదేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు. అందరికీ వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలపై అధికార యంత్రాంగం వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఈ ఘటనలో ఎట్టకేలకు సాయిబాబా పాఠశాల యజమాని, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో పాటు భార్య శ్రీదేవి, కుమారుడు సుధీర్ రెడ్డిపై తాలూకా పోలీసులు కేసులు నమోదు చేశారు.

విశాఖలోని పాఠశాలలో ప్రమాదం.. నలుగురు విద్యార్థులకు గాయాలు

ప్రాథమిక పాఠశాలలో పెచ్చులూడిన పైకప్పు.. విద్యార్థికి గాయాలు

Last Updated : Jul 3, 2024, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details