Arguments in High Court on MLA Pinnelli Case:మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ బూత్లో ఈవీఎంను పగలగొడుతూ అడ్డంగా దొరికిపోయిన కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ పొందిన మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనపై నమోదు చేసిన మరో మూడు కేసుల్లో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్స్టేషన్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై రెంటచింతల పోలీసులు పిన్నెల్లితో పాటు మరో 15 మందిపై ఐపీసీ 307- హత్యాయత్నంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలింగ్ తర్వాతి రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరిచారు. సీఐ ఫిర్యాదు మేరకు పిన్నెల్లి, ఆయన తమ్ముడు, అనుచరులపై 307 తదితర సెక్షన్ల కింద కారంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. పాల్వాయిగేటు పోలింగ్ బూత్లో ఈవీఎంను బద్దలుకొట్టి బయటకొస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లిని చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ ప్రశ్నించగా ఆమెను తీవ్రంగా దుర్భాషలాడారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు ఐపీసీ సెక్షన్ 506, 509, ఆర్పీ చట్టం సెక్షన్ 131 కింద కేసు నమోదు చేశారు.
మూడు కేసుల్లో ముందస్తు బెయిలు కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఆదివారం జరిగిన అత్యవసర విచారణలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో పిటిషనర్పై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారన్నారు. ఈవీఎంను పగలగొట్టిన కేసులో జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారని చెప్పారు. పోలీసుల తరఫున పీపీ నాగిరెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు విధించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారని దీంతో పోలీసులు ఆయన కదలికలపై నిఘా ఉంచలేకపోయారని తెలిపారు.