ADULTERATED RED CHILI POWDER :ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన కల్తీ కారం మార్కెట్ను ముంచెత్తుతోంది. మిర్చి సాగు, దిగుబడికి ఎంతో ప్రసిద్ధి చెందిన గుంటూరు మిర్చియార్డు పరిసర ప్రాంతాల్లోని కొన్ని మిల్లులు కేంద్రంగా ఈ అక్రమం నడుస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ప్రధాన కంపెనీలతో పోలిస్తే తక్కువ ధరకే వస్తుండడంతో వ్యాపారులు సైతం నాసిరకమైన కల్తీ కారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
గోదారోళ్ల 'ఎండు మెత్తళ్ల ఆవకాయ పచ్చడి' - ఇవి కలిపి పెడితే ఏడాదంతా నిల్వ ఉంటుంది
మిర్చి తొడిమలు, కొద్దిపాటి రసాయనాలు కలిపి నాసిరకం కారం తయారు చేస్తుండగా తక్కువ ధరకే వస్తుండడంతో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దానిని తిరిగి ఆకర్షణీయమైన ప్యాకింగ్లో రిటైల్ దుకాణాలకు తరలిస్తున్నారు. ప్రమాదకరమైన కల్తీ కారం గుంటూరుతో తయారవుతూ మార్కెట్ను ముంచెత్తుతోంది. మిర్చియార్డు పరిసర ప్రాంతాల్లోని మిల్లులే కేంద్రంగా ఈ అక్రమం నడుస్తోందని తెలుస్తోంది. కొన్ని మిల్లుల యజమానులు ప్రత్యేకంగా తాలుకాయలతో తయారు చేసిన కారాన్నే విక్రయిస్తున్నారు.
తక్కువ పెట్టుబడితో
పది కిలోల కారం తయారీ కోసం దాదాపు రెండు కిలోలు అదనంగా అంటే 12 నుంచి 12.5 కిలోల మిర్చిని మర పట్టించాలి. తొడిమలు, వ్యర్థాలు పోను మిర్చి ద్వారా నాణ్యమైన కారం వస్తుంది. ప్రస్తుతం కిలో ఎండుమిర్చి ధర సగటున రూ. 130 చొప్పున లెక్కిస్తే కిలో కారం తయారీ, ప్యాకింగ్, రవాణా ఖర్చులు కలిపి రూ.190 వరకు పెట్టుబడి అవుతోంది. ప్రముఖ కంపెనీలు కారం ఉత్పత్తులను మార్కెట్లో కిలో రూ. 300 నుంచి రూ. 500 మధ్య విక్రయిస్తున్నాయి. కానీ, పలువురు వ్యాపారులు కల్తీ కారం కిలో రూ.140కే అమ్ముతున్నారు. అదీ గాకుండా 25 కిలోల బస్తా కొనుగోలు చేస్తే కిలో రూ.100 మాత్రమే ధర పడుతోంది. మిర్చియార్డులో వదిలేసిన తాలు, రంగుమారిన కాయలు, నాణ్యత లేనివి, కోల్డ్ స్టోరేజీల్లో బస్తాలను మార్చే క్రమంలో మిగిలిపోయిన మిర్చి తుక్కును వ్యాపారులు కిలో రూ.30 నుంచి రూ.60లోపే కొనుగోలు చేస్తున్నారు. తొడిమలు తీయకుండానే మర పట్టిస్తూ ఎరుపు రంగు కోసం రసాయనాలు, రంగులు, పొద్దుతిరుగుడు నూనె, పామాయిల్ కలుపుతున్నారు. నిత్యం కారం వినియోగం ఎక్కువగా ఉండే అల్పాహారం, మాంసాహార విక్రయశాలలు, హోటళ్లు, క్యాటరింగ్ వారికి ఎక్కువ మొత్తంలో కల్తీ కారం అమ్ముతున్నారు.