తెలంగాణ

telangana

'ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్ - అంకురార్పణ చేసిందే కాంగ్రెస్' - PARTY DEFECTIONS IN TELANGANA

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 9:38 AM IST

Updated : Jul 2, 2024, 10:17 AM IST

Polical Leaders Party Changings in Telangana : పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రంలో మరోసారి రాజకీయవేడి రాజుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీల మధ్య మాటలు తూటలు పేలుతున్నాయి. ఫిరాయింపులకు కేసీఆరే ఆద్యుడని రేవంత్‌ విమర్శిస్తే ఆయారామ్‌ గయారామ్‌ల సంస్కృతికి అంకురార్పణ చేసిందే కాంగ్రెస్‌ అని కేటీఆర్ ఎదురుదాడి చేశారు. పీసీసీ అధ్యక్షునిగా చేరికల్ని వ్యతిరేకించిన రేవంత్‌ ఇప్పుడు ఎలా కండువాలు కప్పుతున్నారని బీజేపీ దుయ్యబట్టింది.

Party Change Leading To Political Heat in Telangana
Party Change Leading To Political Heat in Telangana (ETV Bharat)

Party Change Leading To Political Heat in Telangana : ఎమ్మెల్యేల చేరికల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. 64 సీట్లతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ పార్లమెంటు ఎన్నికల ముంగిట ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌పై బీఆర్ఎస్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్‌ వైఖరిని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు తప్పుపడుతున్నారు. బీఆర్ఎస్‌ విమర్శలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడుతామని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్‌ ఫిరాయింపుల‌కు పాల్పడుతోందని బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని డిమాండ్‌ చేశారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు.

'ఆపరేషన్​ ఆకర్ష్​'ను ఉద్ధృతం చేసిన కాంగ్రెస్ - త్వరలోనే పార్టీలోకి మరో 13 నుంచి 14 మంది ఎమ్మెల్యేలు! - Telangana Congress Joinings

"దీనికి పునాదులు వేసింది ఎవరు? 61మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చి నెల తిరగక ముందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుంది. వందరోజులు కూడా ఈ ప్రభుత్వం పని చేయదు అని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అన్నారు. దానికి వంత పాడింది బీజేపీనే కదా. వాళ్లు అన్నమాటలను గాలికి వదిలేయాలా." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

బీజేపీ కూడా కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించింది. పీసీసీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు స్వయంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే రాజీనామాలు చేయించాలని డిమాండ్‌ చేశారు.

"భారత దేశంలో అయారామ్‌ గయారామ్‌ సంస్కృతి మొగ్గ తొడిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. ఇంధిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు హరియాణాలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వారిని గుంజుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2004లో మాతో పొత్తు పెట్టుకున్నారు. మా ఎమ్మెల్యేలు 26 మంది గెలిస్తే పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ సవాల్ విసురుతున్నా పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీకి రా." - కేటీఆర్‌, మాజీ మంత్రి

పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీలో సహకరించుకున్నాయి :బీజేపీ-బీఆర్ఎస్‌ కుమ్మక్కులో భాగంగానే తన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోరుతున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విమర్శించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు సహకరించుకున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్‌ నుంచి మరో 13 నుంచి 14 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ప్రచారంతో ఫిరాయింపులపై మరింత వేడి రాజుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

'చరిత్ర పునరావృతం అవుతుంది' - ఫిరాయింపులపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు - KTR React on Leaders Leaving

కాంగ్రెస్​లో చేరికల చిచ్చు - పీసీసీ దూకుడుపై ఏఐసీసీ రియాక్షన్ ఎలా ఉండనుంది? - JOININGS IN TELANGANA CONGRESS

Last Updated : Jul 2, 2024, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details