లాక్డౌన్ వేళ ఖాళీ సమయంలో రకరకాల వంటకాలు నేర్చుకుని వండేస్తున్నారు చాలామంది. నచ్చినవి తింటే మంచిదే కానీ అలా మితిమీరి తినేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే, మీకు నచ్చే వంటకాలకు బదులుగా.. మీరు మెచ్చే రుచులతోనే ఆరోగ్యకరమైన రెసిపీలను చేసుకోవచ్చు అంటున్నారు న్యూట్రిషనిస్ట్ డా. దివ్యా గుప్తా .
నచ్చే ఆహారాన్ని ఆరోగ్యంగా ఎలా మార్చుకోవాలంటే...
తెల్లన్నం బదులు గోబీ రైస్..
సాధారణ బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మరి అన్నం తినకుండా ఉండగలమా? అందుకే, ఆ బియ్యంలో గోబీ పువ్వు వేసుకుని.. కాలిఫ్లవర్ రైస్ చేసుకుంటే.. శరీరానికి అత్యధికంగా విటమిన్ సీ అందుతుంది. కార్బోహైడ్రేట్లను మీ శరీరంలోకి చేరనీయదు. గోబీ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉంటాయి.
చిప్స్ స్థానంలో పాప్కార్న్...
నూనెలో వేయించిన ఏ చిప్స్లోనైనా కొవ్వు అధికంగా ఉంటుంది. కానీ, మొక్కజొన్న పేలాలు చాలా హెల్తీ. ఇవి చిప్స్ తినాలనే కోరికనూ తీర్చేస్తుంది. అయితే, నూనెలో దట్టంగా వేయిస్తే పాప్కార్న్లోనూ ఫ్యాట్ శాతం పెరిగిపోతుంది. అందుకే, కాస్త ఆలివ్ నూనె, వెల్లుల్లి ఉప్పు వేసుకుని తింటే అదిరిపోతుంది.
పాత పద్ధతినే కొత్తగా..
మన పూర్వీకులు ఏరికోరి ఆరోగ్యకరమైన చిరు ధాన్యాలను తిన్నారు. రాగి, కొర్రలు, సజ్జలు, వరిగులు, జొన్నలు, సామలు, అరికలు, ఊదలు వంటి చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, పాత రుచులు నచ్చనివారు వీటితో కిచిడీ, పోహా, ఇడ్లీ, దోసలు వేసుకుని తినొచ్చు. ఈ ధాన్యాల్లో కావలసినన్ని ప్రోటీన్లు, విటమిన్ బీ, ఫైబర్, ఐరన్, కాల్షియం, పీచు పదార్ధం, పాస్పరస్, జింక్, పొటాషియం, కాపర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉంటాయి.
ఖిలా ఖిలా కినోవా!
కినోవా... బియ్యం వంటి ధాన్యాలకు గొప్ప ప్రత్యామ్నాయం. ఫైబర్ అధికంగా ఉండి కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం ఉంటాయి. వీటితో రొట్టెలు, కిచిడీ, సలాడ్, కినోవా టిక్కీ చేసుకుంటే బాగుంటుంది..
చిలకడదుంప చిప్స్ చేస్తే...