కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సీసీ కెమెరాలను బిగించిన అధికారులు... వైద్యశాఖ కార్యాలయానికి అనుసంధానం చేశారు. వైద్యులు, సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. ప్రజలకు నాణ్యమైన సేవలందుతుండటం వల్ల కేంద్రాలకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
కరోనా భయంతో ప్రైవేటు ఆసుపత్రులు నెల రోజుల నుంచి తెరవలేదు. ఈ పరిస్థితుల్లో రోగులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బాట పట్టారు. రెండో విడతలో వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రాంతీయాసుపత్రుల్లో సీసీ కెమెరాల బిగింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడురోజులకు ఒకసారి సమీక్ష...
- మూడు రోజులకోసారి కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
- వైద్యసేవలందుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు.
- సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.
- సోమవారం నుంచి అమ్మఒడి సేవలు పునరుద్ధరించారు.
అదనపు పర్యవేక్షణ...
పీహెచ్సీల పనితీరు మెరుగుపరిచేందుకు అదనపు పాలనాధికారి వెంకటేశ్ ధోత్రేకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఆయన వారం రోజులకోమారు వైద్యశాఖ అధికారులతో సమీక్షిస్తున్నారు.
ఖాళీలు భర్తించేసేందుకు...
దీర్ఘకాలిక రోగులకు ఔషధాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక వైద్యాధికారిని నియమించారు. ఆరోగ్య ఉపకేంద్రాల పనితీరును మెరుగుపరచాలని ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలని భావిస్తున్నారు.
రోగులకు నమ్మకం పెరిగింది...
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు మెరుగుయ్యాయి. ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. ఓపీ సేవలు వినియోగించుకొనే రోగుల సంఖ్య పెరగడం వల్ల రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాం. కలెక్టర్ సూచనలతో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలందిస్తున్నారు.
- చంద్రశేఖర్, జిల్లా వైద్యాధికారి, కామారెడ్డి
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలు...
- పట్టణ ఆరోగ్య కేంద్రం : 1
- జిల్లా ఆసుపత్రి : 1
- ప్రాంతీయ ఆసుపత్రులు : 2
- సామాజిక ఆరోగ్య కేంద్రాలు : 6
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 20
- ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు : 201