రాష్ట్రంలో యూరియా కొరత, ఆందోళనల నేపథ్యంలో అన్ని జిల్లాల నుంచి రబీ సాగుకు సంబంధించిన సమాచారం సేకరించాలని మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. యూరియా సరఫరా విధానం, తాజా పరిస్థితులపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సంబంధించి యూరియా, నౌకాశ్రయాల నుంచి తరలింపు, రేక్ పాయింట్ల నుంచి రవాణా, రైతులకు లభ్యత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ నెల 11న దిల్లీలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ సమావేశంలో రబీ సీజన్కు అవసరమైన ఎరువుల అంచనాలపై నివేదిక అందజేయాలని అధికారులకు సూచించారు.
స్థానిక ప్రజాప్రతిధులతో సంప్రదింపులు
యూరియా సరఫరా త్వరితగతిన సాగేందుకు పోర్టు ఇంఛార్జీ, రైల్వే ఇంఛార్జీలతో సంప్రదింపులు జరపాలని పేర్కొన్నారు. గంగవరం, విశాఖపట్టణం, ట్యుటికోరిన్, కాకినాడ, కరైకల్, కృష్ణపట్నం పోర్టుల నుంచి రాష్ట్రానికి వస్తున్న యూరియా విషయమై ఆరా తీశారు. గుజరాత్ హజీరా క్రిబ్ కో యూనిట్, చెన్నై మద్రాస్ ఫెర్టిలైజర్స్ నుంచి తెలంగాణకు యూరియా చేరుకుంటున్న దృష్ట్యా... అన్ని జిల్లాలకు చేరుకున్న యూరియా నిల్వల సమాచారం తెలుసుకోవాలన్నారు. ఆయా జిల్లాల్లో కొంత మంది ప్రజాప్రతినిధులతో సంప్రదించి అదనపు అవసరాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలని ఆదేశించారు.
యూరియా నిల్వలపై మీడియాకు సమాచారం ఇవ్వండి
నిజామాబాద్కు 2, మిర్యాలగూడ, కరీంనగర్, సనత్నగర్ ఒక్కో రేక్ చేరుకున్నాయని... స్టాక్ పాయింట్లకు చేరుకున్న యూరియా నిల్వల విషయమై క్షేత్రస్థాయి అధికారులు మీడియాకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. మొత్తం ఈ నెలలో ఇప్పటి వరకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా 64,485 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. రవాణాలో 33,205 మెట్రిక్ టన్నులు, వివిధ పోర్టుల్లో రవాణాకు సిద్ధంగా 7,800 మెట్రిక్ టన్నులు ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, అదనపు సంచాలకులు విజయ్ కుమార్ తదిరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: యూరియా కొరత రానివ్వం: పార్థసారధి