భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సంబంధ వివాదాల పరిష్కారం కోసం ఇరుదేశాల ఉన్నతాధికారులు ఇవాళ సమావేశం కానున్నారు. జపాన్లోని ఒసాకాలో జీ-20 సదస్సు సందర్భంగా మోదీ-ట్రంప్ భేటీ అనంతరం భారత్-అమెరికాల మధ్య జరగనున్న తొలి సమావేశం ఇదే కావడం విశేషం.
ఇరుదేశాల అధికారుల మధ్య చర్చలు జరగాలని ఒసాకా సమావేశం సందర్భంగా మోదీ, ట్రంప్ నిర్ణయించారు. అందులో భాగంగా దక్షిణ, మధ్య ఆసియా, సహాయక యూఎస్ వాణిజ్య ప్రతినిధి (ఏయూఎస్టీఆర్) క్రిస్టోఫర్ విల్సన్ నేతృత్వంలోని బృందం భారతీయ అధికారులతో నేడు సమావేశం కానుంది. అలాగే వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్తోనూ ఈ బృందం భేటీ అవుతుంది.
నిర్మాణాత్మక చర్చలు జరుపుతాం...
అమెరికాతో ఎల్లప్పుడూ నిర్మాణాత్మక, సానుకూల సంబంధాలు కోరుకుంటున్నామని భారత విదేశాంగమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీశ్కుమార్ తెలిపారు. అందులో భాగంగా వాణిజ్య మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఆధ్వర్యంలోని భారత ప్రతినిధి బృందం.. విల్సన్ బృందంతో చర్చలు జరుపుతుందని వెల్లడించారు.
ఈ భేటీలో వాణిజ్యం, సుంకాలు, అలాగే డేటా స్థానికీకరణ సమస్యలపైనా చర్చించనున్నట్లు సమాచారం.
ఇదీ జరిగింది...
అమెరికా జూన్ 5 నుంచి అమల్లోకి తెచ్చిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రోగ్రామ్ కింద భారత్కు ఉన్న ఎగుమతి ప్రోత్సాహాలను వెనక్కి తీసుకుంది. భారత ఉత్పత్తులైన ఉక్కు, అల్యూమినియంలపై అమెరికా సుంకాలు పెంచింది. దీనికి ప్రతిగా జూన్ 16 నుంచి 28 అమెరికా ఉత్పత్తులపై భారత్ కస్టమ్స్ డ్యూటీ పెంచింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య వాణిజ్యచర్చలు మందగించి ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించింది.
ఆమోద యోగ్యం కాదు..
అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక కస్టమ్స్ సుంకాలు విధించడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. యూఎస్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు మరింత తగ్గించాలని ఆయన భారత్ను కోరుతున్నారు.
తమ డైరీ ఉత్పత్తులకు భారత్లో మార్కెట్ కల్పించాలని... సమాచార, సాంకేతిక ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గించాలని అమెరికా కోరుతోంది. అలాగే అమెరికాకు చెందిన వైద్య పరికరాల ధరలపై విధిస్తున్న పరిమితులపైనా ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే భారత జాతీయ ప్రయోజనాలను మీరి చర్చలు జరిపే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ప్రకృతి ప్రేమికుల మనసు దోచే హుకో జలపాతం