అరకు వైసీపీలో అసంతృప్తి జ్వాలలు - 'మాధవి వద్దు' అంటూ ఆందోళనలు - Ycp nayakula andolana
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 4:37 PM IST
YCP Leaders Protest Of Madhavi Constituency Incharge: అల్లూరి జిల్లా అరకులోయ వైసీపీలో అసంతృప్తి జ్వాలలు మిన్నంటాయి. అరకు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపీ గొడ్డేటి మాధవిని అధిష్ఠానం నియమించడంపై స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ ఎంపీగా పనిచేసిన ఐదేళ్ల పదవీ కాలంలో కనీసం ఐదు సార్లు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదని కార్యకర్తలు తెలిపారు. నియోజకవర్గంలో పర్యటించని మాధవికి ఏ విధంగా అధిష్ఠానం అసెంబ్లీ టికెట్ను కేటాయిస్తుందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. స్థానిక వైసీపీ నేతలకే అరకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించేలా అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
స్థానిక నాయకులకు టికెట్ ఇవ్వకుంటే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని వారు హెచ్చరించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు 'మాధవి వద్దు స్థానికులే ముద్దు' అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధాన రహదారి కూడలిలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్సీ రవిబాబు వర్గీయులు పాల్గొన్నారు.