కడప జిల్లాలోని పసుపు పంట కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలపై అధికారులు అప్రమత్తమయ్యారు. పసుపు పంటకు ధరల్లేక ఇబ్బంది పడుతున్న రైతుల కోసం ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ముందు మార్కెట్ యార్డుల్లో కొనుగోలు చేయాలని సంకల్పించింది. తరువాత ఏమైందో తెలియదు కాని జిల్లాలో రాజంపేట మినహా మిగిలిన ప్రాంతాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఫిర్యాదులు రావడం అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో డీసీఎంఎస్కు కొనుగోలు బాధ్యతలు రద్దు చేసి మార్కెట్యార్డులకే కొనుగోలు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని రాజంపేట, సిద్ధవటం, కమలాపురం, జమ్మలమడుగు, ఖాజీపేట, మైదకూరు, బద్వేలు మార్కెట్యార్డు కమిటీలకు కొనుగోలు బాధ్యతలు అప్పగించారు. కడపలో ఉన్న రెండు కేంద్రాలను రద్దు చేసి చెన్నూరు చక్కెర పరిశ్రమ ఆవరణలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.
వ్యవస్థలు మారినా..
పసుపు కొనుగోలు అంశంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నడిచే కొనుగోలు కేంద్రాలు అక్రమాల పుట్టని, వాటిని రద్దు చేసి మార్కెట్ కమిటీలకు కొనుగోలు బాధ్యతలు అప్పగిస్తే ఉల్లిపాయ ముక్క చందమైందనే విమర్శలొస్తున్నాయి. రైతులు తెచ్చిన దిగుబడులను కొనుగోలు చేయాలంటే క్వింటాళ్లకు రూ.200 పాత పసుపైతే క్వింటాళ్లకు రూ.500 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మార్కెట్ కమిటీలు పెద్ద విమర్శలు మూటకట్టుకుంటున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల వాయిస్ రికార్డు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇటీవల చెన్నూరు కొనుగోలు కేంద్రంలో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. పాత పసుపును కొనుగోలు చేస్తున్నారని రైతులు అంటున్నారని కడప మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కరరెడ్డి నేరుగా జేసీ గౌతమికి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. అ అంశంపై జేసీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడ పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంలో ఛైర్మన్ పాత పసుపు కొనుగోలు చేశారని చెబుతూ పలు లాట్ నెంబర్లును అధికారులకు చూపించారు. దీంతో ఉద్యానశాఖ అధికారులను పంపి ఆ పసుపును తీసుకొచ్చి పాతదా? కొత్తదా? అనేది పరిశీలించాలని ఆదేశించారు. శాసనసభ్యులు, ప్రభుత్వ పెద్దలు పసుపు కొనుగోలు వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కిందిస్థాయి సిబ్బంది చేత కొనుగోలు కేంద్రంలో డబ్బు వసూలు ఎందుకు చేశారు, ఎవరు చేయమంటే చేశారు, లేదా మీ అంతటా మీరే వసూలు చేశారానేది రాతపూర్వకంగా రాయించుకున్నట్లు తెలిసింది. ఇలా చెన్నూరు కొనుగోలు కేంద్రంలోనే కాదు జిల్లాలో పలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇవీ చూడండి...