Rail Roko: కడపజిల్లా కమలాపురం రైల్వేస్టేషన్లో ఏడాది నుంచి రైళ్లు నిలపక పోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రైల్రోకో నిర్వహించారు. కమలాపురం-కాజీపేటకు వెళ్లే మార్గంలో రైల్వేగేటు వద్ద గంటపాటు బైఠాయించి ధర్నా చేపట్టారు. రైలు పట్టాలపై కూర్చుని రైళ్లు నిలపాలని నినాదాలు చేశారు. కొవిడ్ ముందు వెంకటాద్రి, ముంబాయి-చెన్నై ఎక్స్ప్రెస్, హరిప్రియ ఇలా అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు కమలాపురం, నందలూరు, కొండాపురం రైల్వేస్టేషన్లలో నిలిపేవని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కానీ కొవిడ్ తర్వాత ప్రయాణికులు రైళ్లు ఎక్కడం లేదనే కారణంతో.. ఈ రైల్వేస్టేషన్లలో రైళ్లు నిలపడం లేదని అన్నారు.
రైల్వే బోర్డుకు గతంలో విన్నవించినా పట్టించుకోలేదని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. గత్యంతరం లేని స్థితిలోనే ఇవాళ రైల్ రోకో చేయాల్సి వచ్చిందని అన్నారు. రైల్రోకో చేస్తున్న సమయంలో స్టేషన్ సమీపంలో ముంబాయి-చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నిలిపివేశారు. కమలాపురం రైల్వే స్టేషన్కు వచ్చి స్టేషన్ మాస్టర్కు వినతి పత్రం అందజేశారు. వారంలోపు రెండు రైళ్లు కమలాపురం రైల్వేస్టేషన్లో నిలిపేవిధంగా చర్యలు తీసుకుంటామని.. గుంతకల్లు ఏడీఆర్ఎం హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఇదీ చదవండి: నిత్యావసరాల ధరలు తగ్గించాలి.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు చంద్రబాబు పిలుపు