కడప జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలుళ్లకు కారణమైన క్వారీ నిర్వాహకులు అనుమతులు తీసుకున్నారా? వారికి లైసెన్స్ ఉందా అనే విషయాలను తేల్చడంతో పాటు ఘటనపై నివేదిక సమర్పించాలని సంయుక్త నిపుణుల కమిటీకి జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. మామిళ్లపల్లి సమీపంలోని బైరటీస్ క్వారీకి జిలెటిన్ స్టిక్స్ తరలిస్తున్న వాహనంలో పేలుడు సంభవించి ఈనెల 8న పది మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఎన్జీటీ సుమోటోగా స్వీకరించగా...జస్టిస్ కె.రామకృష్ణన్, విషయ నిపుణుడు డాక్టర్ కె.సత్యపాల్తో కూడిన ధర్మాసనం శుక్రవారం కేసు విచారణ చేపట్టింది. సంబంధిత ఉత్తర్వులు శనివారం వెలువడ్డాయి.
పేలుళ్లపై తాము ఇప్పటికే కమిటీని నియమించి, క్వారీ లైసెన్సుదారులపై తగిన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది మాధురి దొంతిరెడ్డి ట్రైబ్యునల్కు నివేదించారు. ఇలాంటి సందర్భాల్లో నియమిస్తున్న కమిటీలు... తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘన, లైసెన్సు నిబంధనల అతిక్రమణ, రాయల్టీ, జరిమానా అంశాలకే పరిమితమవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే క్వారీ నిర్వాహకులకు ఉన్న అనుమతులు, వాటికి మించి చేసిన తవ్వకాలు, పర్యావరణానికి జరిగిన నష్టం, సహజ వనరుల దోపిడీ, అందుకు చెల్లించాల్సిన పరిహారం, పేలుళ్లతో చనిపోయిన, గాయపడిన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపు అంశాలపై సమగ్ర విచారణకు సంయుక్త నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ అంశాలతో పాటు అక్కడికి సమీపంలో ఇతర క్వారీలు, వాటి నిర్వహణ, నిబంధనల ఉల్లంఘనలు, తీసుకుంటున్న చర్యలపైనా మరో నివేదిక సమర్పించాలని సూచించింది.