కడప జిల్లా రాయచోటి నడిబొడ్డునున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల... 90 ఏళ్ల క్రితం బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఉన్నత పాఠశాల... ఎంతోమందిని విద్యావేత్తలుగా తీర్చిదిద్దాయి. అలాంటి కళాశాల మైదానం ఇప్పుడు ఓట్ల రాజకీయాలకు బలవుతోంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా... రాజకీయ పావులా వాడుకుంటోంది. గత కొన్ని రోజులుగా స్థానిక ఎమ్మెల్యే ఈ స్థలాన్ని ఓ వర్గానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి.
దాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు నిరసనలు చేపట్టాయి. తాజాగా రాయచోటి సభలో స్వయంగా సీఎం జగన్ స్థలాన్ని వక్ఫ్బోర్డుకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీనిని ఖండిస్తూ విద్యార్థి సంఘాలు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. గత పదేళ్లుగా మసీదు కమిటీ, కళాశాల కమిటీ మధ్య స్థలం గురించి వివాదం నడుస్తోంది. 2015లో స్థలాన్ని పరిరక్షిస్తూ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని హైకోర్టు తీర్పునిచ్చింది.
అధికారులు మాత్రం మూడువైపులా గోడ నిర్మించి... రాజకీయ అడ్డంకులతో మరొకవైపు నిలిపివేశారు. ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఎం జగన్ ప్రకటన చేయడం మిగిలిన వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేపై కోర్టు ధిక్కరణ కేసు వేసేందుకు ప్రజాసంఘాలు సిద్ధమయ్యాయి. కళాశాల స్థలాన్ని వెంటనే కాలేజీ కమిటీకి అప్పగించాలని... లేకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ప్రజా సంఘాలు, విద్యార్థి జేఏసీ హెచ్చరించింది.