వర్షాలపై ఆధారపడిన రాయలసీమ సాగు భూములు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. రైతన్నలూ...రండి! సాగు చేయండి అని పిలుస్తున్నాయి. ఈ ఏడాది రబీలో పంటల సాగుకు వర్షాలు అనుకూలించాయి. కుంటలు, చెరువుల్లోకి నీరు చేరింది. బోరు బావుల్లో భూగర్భజలాలు పెరిగాయి. రైతన్న మదిలో పంట పండించాలనే కోరిక పెంచాయి. బీడు భూముల్లో పంటల సాగుకు సమాయత్తమయ్యారు.
సర్కారు ఆదుకోకపోయినా...
ప్రభుత్వం నుంచి రాయితీ ఎరువులు, విత్తనాలు అందరికీ అందకపోయినా... అధిక ఖర్చులు భరించి వరి సాగుకు రైతులు ముందుకు వెళ్తున్నారు. దుక్కు, ఎరువులు, కూలీలు కలిపి ఎకరా పోలానికి సుమారు రూ.30 వేలు పెట్టుబడి అవుతుందని కడప జిల్లాకు చెందిన పలువురు రైతులు చెబుతున్నారు.
కొట్టుమిట్టాడుతోన్న కర్షకులు
నిత్యం కరవు తాండవిస్తోన్న సీమ జిల్లాల్లో సాగునీటి లభ్యత తక్కువగా ఉంటుంది. కేవలం బోరుబావుల పైనే ఆధారపడాలి. అలా అని పంట సాగుచేద్దామన్నా... చివరి వరకు నీరు అందుతుందనే నమ్మకం లేదని రైతులు వాపోతున్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చి సీమను సస్యశ్యామలం చేస్తామన్న పాలకుల మాటలు... ఇప్పటికీ నెరవేరలేదన్న ఆవేదన వారిలో ఉంది. ఫలితంగా పంటలు పండించలేక, ఆశ చావక అయోమయంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
మెరుగైన మార్గాలు
రైతులు అధిక దిగుబడి కోసం తమకు తోచిన మార్గాలు ఎంచుకుంటున్నారు. దుక్కిలో పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగిస్తున్నారు. రసాయన ఎరువుల కంటే ఇవి పంటకు అధిక బలాన్ని చేకూరుస్తాయని రైతులు తెలిపారు. వీటితోపాటు ఆముదం, కానుగ, వేప పిండి చల్లుతున్నారు. మరి కొందరు పొలం గట్లపై ఉన్న చెట్ల ఆకులను కత్తిరించి దుక్కిలో వేసి దున్నుతున్నారు. 20 నుంచి 25 రోజుల లోపలే ఆకులు కుళ్ళి సేంద్రియ ఎరువులుగా మారి... వరి మొక్కలకు తోడ్పడతాయన్నారు. వరి పంటను చీడపీడలు ఆశించకుండా అక్కడక్కడా కొంత ఖాళీ ప్రదేశాన్ని వదులుతున్నారు. దీనివల్ల పైరుకు గాలి తగిలి అధిక దిగుబడికి ఆస్కారం ఉంటుందని రైతులు చెప్పుకొస్తున్నారు.
ఆరుగాలం కష్టపడే తమకు అధికారుల నుంచి సరైన సాకారం అందితే... సేంద్రియ సాగుతో పాటు అధిక దిగుబడులను సాధిస్తామని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: