హలో.. అంతా బాగున్నారమ్మా.. అబ్బాయి ఇంట్లో లేడా.. మీ అత్త మనూరి సర్పంచిగా పోటీ చేస్తోంది. మీరు ఎలాగోలా వీలు చేసుకొని పోలింగ్ రోజు తప్పకుండా వచ్చి ఓటేయాలి. ఆ రోజు ఉదయాన్నే బండి పంపుతా. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోండి. నేను ఫోన్ చేశానని మా వాడు వచ్చాక మరిచిపోకుండా చెప్పమ్మా..
ఆ బాధ్యతే నీదే..!
బాబాయ్.. నేను మన వార్డు నుంచి పోటీ చేస్తున్నా. నన్ను ఎలాగైనా గట్టెక్కించాలి. పొరుగూళ్లలో ఉంటున్న మనోళ్లందరినీ రప్పించే బాధ్యత నీదే. ఎలా చేస్తావో, ఏం చేస్తావో అంతా నీదే భారం..పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాల్లో ఈ తరహా సంభాషణలు వినిపిస్తున్నాయి.
ప్రైవేటు బస్సుల్లో టిక్కెట్లు రిజర్వేషన్
ఆకివీడు మండలంలో జనరల్ మహిళకు రిజర్వు అయిన ఒక గ్రామంలో మూడు పార్టీల మద్దతుదారుల సతీమణులు పోటీలో ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన ఓటర్లలో కొందరు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చివెళ్లారు. ఇప్పుడు ఓటు వేసేందుకు వారందరినీ తీసుకొచ్చేలా ప్రైవేటు బస్సుల్లో టిక్కెట్లు రిజర్వేషన్ చేయిస్తున్నట్లు వినికిడి.
అందరూ రావాలి..!
పోడూరు మండలంలోని ఒక పంచాయతీలో ఆర్థికంగా బలమైన వర్గానికి చెందిన వారు పోటీపడుతున్నారు. అభ్యర్థుల బంధుమిత్రలంతా విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. వీరిలో చాలావరకు వివిధ కారణాలతో సంక్రాంతికి స్వస్థలాలకు రాలేకపోయారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వారందరినీ రప్పించేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పాలకొల్లు మండలంలో రెండు పంచాయతీల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది.
గట్టి పోటీ
ఉండి మండలం మహదేవపట్నంలో ఒకవార్డులో గట్టి పోటీ నెలకొంది. అక్కడ ఉన్న ఓట్లు 340 కాగా ఇద్దరు బరిలో ఉన్నారు. కనీసం 300 ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రతి ఓటు కీలకంగా మారనుండటంతో ఉపాధి నిమిత్తం హైదరాబాద్, విశాఖపట్నంలలో ఉంటున్న స్థానికులను పోలింగ్ రోజున గ్రామానికి రప్పించేలా ఇరుపక్షాల నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఖర్చులను భరిస్తా
వీరవాసరం మండలంలోని ఓ మేజర్ పంచాయతీలో ఒక వార్డుకు ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అక్కడ గెలిచి ఉపసర్పంచి పదవి దక్కించుకునేందుకు యత్నిస్తున్న అభ్యర్థి ఒకరు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను ముందుగానే ప్రసన్నం చేసుకోవడంతో పాటు వారి రాకపోకలకు అయ్యే ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. మిగిలిన ఇద్దరు అభ్యర్థులు కూడా తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం.
20 వేల వరకు..
నరసాపురం డివిజన్లో నరసాపురం, పాలకొల్లు, ఆచంట, ఉండి, భీమవరం నియోజకవర్గాలకు చెందిన 20 వేల మంది వరకు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నట్లు అంచనా. ఇటీవల భవన నిర్మాణ, అనుబంధ రంగాల పనులకు వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. చదువు, ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో స్థిరపడినవారు ఉన్నా రు. వీరి ఓట్ల వేటలో అభ్యర్థులు తలమునకలయ్యారు.
గ్రామాలకు తరలిపోతూ..
‘మావాడు సర్పంచిగా పోటీలో ఉన్నాడు.. ప్రచారం చేయాలి.. వాడికి చేదోడుగా ఉండాలంటూ భీమవరం లోని అత్యధికులు వీరవాసరం, భీమవరం మండలాల్లో జరిగే ప్రచారంలో నిమగ్నమయ్యారు. వీరంతా వ్యాపారాభివృద్ధి, పిల్లల చదువుల నిమిత్తం భీమవరంలో స్థిరపడ్డారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు పోటీలో ఉండటంతో వారి పిలుపు మేరకు గ్రామాలకు చేరుకుంటున్నారు.
ఇదీ చూడండి.: అందితే జుట్టు.. అందకుంటే చేతులు