ఆర్టీసీ బస్సులో ప్రాణాలు విడిచిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని, ఆయన భార్యను బస్సు సిబ్బంది మార్గమధ్యంలోనే దించేశారు. ఈ విషాదం విజయనగరం జిల్లా బొబ్బిలిలో సోమవారం జరగగా..దీనిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. బస్సు సిబ్బంది మానవత్వంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. వృద్ధుడి కుటుంబం వద్దకు విజయనగరం, పార్వతీపురం డిపో మేనేజర్లు వెళ్లి క్షమాపణలు చెప్పారు.
విజయనగరం జిల్లా సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన దాసరి పైడయ్య (62), పైడమ్మ దంపతులు బుట్టలు అల్లుకుంటూ జీవిస్తున్నారు. పైడయ్య కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు ఆసుపత్రులకు వెళ్లినా నయం కాకపోవడంతో భార్యాభర్తలు పార్వతీపురంలో నాటువైద్యం పొందేందుకు సోమవారం బస్సులో బయలుదేరారు.
మార్గమధ్యంలో గుండెపోటుతో వృద్ధుడు చనిపోయారు. దంపతులను బస్సు సిబ్బంది మధ్యలోనే బొబ్బిలి పెట్రోలుబంక్ కూడలి వద్ద దించేసి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుడు కృష్ణదాస్, స్థానికులు కొందరు వారిని ఆటోలో స్వగ్రామానికి పంపించారు.
ఇదీ చూడండి. ఎన్నికల ఘర్షణలో గాయపడిన.. వార్డు సభ్యుడి తండ్రి మృతి