స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు యంత్రాలను గత ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో మురుగు కాల్వలు శుద్ధి చేసే ట్రాక్టర్లు, చెత్తను తరలించే ఎలక్ట్రికల్ ఆటోలను చెన్నైకి చెందిన ఓ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. ఈ యంత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు అందించారు. అలా విజయనగరం జిల్లాకు కొన్ని వాహనాలను కేటాయించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ యంత్రాలను అందించాలని నిర్ణయించారు. కానీ.. అప్పట్లో అది సాధ్యపడలేదు.
కలెక్టర్ బంగ్లాకు కూతవేటు దూరంలోనే...
అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కూడా ఈ వాహనాల వినియోగంపై దృష్టి సారించలేదు. విజయనగరం.. జిల్లా కేంద్రం అంబేడ్కర్ భవనంలోని ఉన్న ఈ వాహనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కలెక్టర్ బంగ్లాకు కూతవేటు దూరంలోని అంబేడ్కర్ భవన్ ప్రాంగణంలో తుప్పలు, డొంకల మధ్య నిర్లక్ష్యంగా వాహనాలను వదిలేశారు. ఈ ప్రాంగణంలో తొమ్మిది ట్రాక్టర్లు, డ్రైయిన్ క్లీనింగ్ సెట్ లు, 14 ఎలక్ట్రికల్ ఆటోలు ఉన్నాయి. బ్యాటరీ ఛార్జింగ్ తో నడిచే ఈ ఆటోలు ఒక్కోదాని ధర లక్షరూపాయల పైమాటే. సుమారు కోటి రూపాయల విలువ చేసే వాహనాల విషయంలో అధికారులు తీరుపై విమర్శలు వస్తున్నాయి.
ఈ వాహనాలను అర్హులకు అందించాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఇప్పటికే వాహనాల్లో బ్యాటరీలు మాయం అవుతున్నాయని, ఇలానే వదిలేస్తే పనికి రాకుండా పోతాయంటున్నారు.
ఇదీ చదవండి : ఎస్ఈసీపై గవర్నర్ నిర్ణయం ప్రజాస్వామ్య విజయం: తెదేపా