రాష్ట్ర పండుగగా గుర్తింపు
పూసపాటిరాజుల ఆడపడచు అయిన పైడితల్లి అమ్మవారి జాతరను ప్రతీ ఏడాది వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలైన పూసపాటి రాజవంశీయులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ పండుగను రాష్ట్ర పండగగా గుర్తించటంతో ఈ ఏడాది నుంచి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రులు బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీవాణి అధికారులతో సమీక్షించారు. అమ్మవారి పండుగకు సంబంధించిన ఏర్పాట్లన్నీ తుదిదశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు..
అమ్మవారి ప్రధాన పూజారి నివసించే ప్రాంతమైన హుకుంపేటలో సిరిమాను రూపుదిద్దుకుంటుంది. అక్కడనుంచి ఈ సిరిమానును.... సిరిమానోత్సవం నాడు అమ్మవారి చదురుగుడి వద్దకు మేళతాళాలు, సాంస్కృతిక కళారూపాల నడుమ సంప్రదాయబద్దంగా తీసుకువస్తారు. అనంతరం అమ్మవారి రూపంగా ఆలయ ప్రధాన పూజారి సిరిమానును అధిరోహిస్తారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గడ్ రాష్ట్రాల నుంచీ భక్తులు వస్తారు.
ముమ్మర ఏర్పాట్లు
అమ్మవారి పండుగ దృష్ట్యా.. భక్తుల సౌకర్యార్థం నగరపాలక సంస్థ తరపున కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిరిమాను తిరిగే ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా 20 ప్రాంతాల్లో శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అమ్మవారి జాతర ప్రశాంతంగా నిర్వహించటమే లక్ష్యంగా పోలీస్ శాఖ కూడా సమాయత్తమవుతోంది. ఉత్సవాల నిర్వహణకు 2,200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
చారిత్రక నేపథ్యంతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక సంబంధం కలిగివున్న ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పైడితల్లి మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధమైంది.