ఎన్నికల్లో అల్లర్లు జరగకుండా చూడాలని, రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పార్వతీపురం డివిజన్లో జరగనున్న ఎన్నికలకు చేపట్టాల్సిన భద్రత చర్యలపై ఆమె పోలీసులకు దిశానిర్దేశం చేశారు. 15 మండలాల్లోని 497 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని, వాటిలో 75 అతి సున్నిత, 135 సున్నిత, 202 సాధారణ, 74 మావోయిస్టు ప్రభావిత, 11 సరైన మార్గం లేని పోలింగు కేంద్రాలున్నట్లు చెప్పారు. ఇప్పటికే 3,033 గ్రామాలను పోలీసులు సందర్శించి, గ్రామసభలు నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించారన్నారు.
గిరిజనులు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకొనే వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరుగుతున్నట్లు అనిపిస్తే డయల్-100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఓఎస్డీ సూర్యచంద్రరావు, అదనపు ఎస్పీలు ఎన్.శ్రీదేవీరావు, పి.సత్యనారాయణ, బెటాలియన్ కమాండెంట్ కోటేశ్వరరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
కొఠియాలో ఎన్నికలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కొఠియా గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ తెలిపారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించామన్నారు. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి: పల్లెపోరు రెండో విడతకు ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్ !