ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు నిలువరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విశాఖ జిల్లా ఆఫీసర్ అన్ స్పెషల్ డ్యూటీ సతీష్కుమార్ తెలిపారు. విశాఖ ఏజెన్సీ గాలికొండ ప్రాంతంలో జగన్తోపాటు మరో ఎనిమిది మంది మావోయిస్టులు తిరుగుతున్నారని... అయితే సరిహద్దుల్లో మావోయిస్టులు కదలికలు ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. అందుకే ఒడిశా అధికారులను సమన్వయం చేసుకుంటూ తమ బలగాలతో గాలింపు చర్యలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
లొంగిపోతే పునరావాసం కల్పిస్తాం..
మావోయిస్టులు ఇప్పటికైనా మార్పు చెంది జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, లొంగిపోయిన మావోయిస్టులకు అవసరమైన పునరావసం, ప్రభుత్వం పరంగా అందించే ఆర్థికసహాయం, తోడ్పాటును అందిస్తామని సతీష్కుమార్ తెలిపారు. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనాయకులు, అనారోగ్యంతో ఉన్నవారు లొంగిపోవాలన్నారు. మావోయిస్టు పార్టీలో విధానాల నచ్చక ఇటీవల సుమారు 44 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారని గుర్తు చేశారు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక రకాల చర్యలు చేపడతున్నామని వృత్తి నైపుణ్యాభివృద్ది సంస్థతో కలిసి గిరిజన నిరుద్యోగులకు పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు.
విశాఖ ఏజెన్సీలో సాగవుతున్న గంజాయి రవాణా, సాగు నియంత్రించడానికి ఇప్పటికే ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారని... అదేవిధంగా అటవీశాఖ తనిఖీకేంద్రాలు వద్ద పోలీసుశాఖ భాగస్వామ్యంగా ఉంటూ గంజాయి రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేశామని ఓఎస్డీ సతీష్కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: