కేంద్రంలో భాజపా అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై విశాఖలో ప్రజలకు అవగాహన కలిగిస్తూ సీపీఎం కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భాజపా తీరు వల్ల కార్మిక వర్గానికి తీరని నష్టం వాటిల్లిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఆదర్శనగర్, ఇందిరానగర్ కాలనీల్లో ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. భాజపా సర్కార్ ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతోందని వాపోయారు.
బడా బాబులకు కట్టబెడుతున్నారు..
స్టీల్ ప్లాంట్ను పోస్కో అనే దక్షిణ కొరియా కంపెనీకి ధారదత్తం చేశారని.. పోర్ట్లు, విమానాశ్రయాలు, బ్యాంకులు, ఎల్ఐసీ, ఆయిల్ కంపెనీలు, రైల్వే ఇలా అన్నింటినీ అంబానీ, ఆదానీలకు కట్టబెడుతున్నారని సీపీఎం నేతలు ధ్వజమెత్తారు. కార్మిక చట్టాలను యాజమాన్యాలకు అనుకూలంగా మార్పు చేసింది భాజపానేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వాలని.. రాజధాని, పోలవరం నిర్మాణాలు నిధులు కేటాయించాలని కోరారు. ఏపీకి జరిగిన అన్యాయంపై రానున్న ఎన్నికల్లో తెలుగు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇవీ చూడండి : వైకాపాది ప్రజాసంకల్ప యాత్ర కాదు.. ప్రజా వంచన యాత్ర : జనసేన