దేశం కాని దేశానికి ఉపాధి నిమిత్తం వెల్డింగ్ పనులకు వెళ్లారు ఆ యువకులు. అక్కడ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించాలని, సొంతింటిని నిర్మించుకోవాలని కలలు కన్నారు. వీసా గడువు ముగియడంతో స్వదేశానికి రావడానికి లిబియా విమానాశ్రాయానికి చేరుకోగానే ఆ ముగ్గురు యువకులు అదృశ్యం అయినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... సంతబొమ్మాళి మండలం నౌపాడ పంచాయతీ సీత నగరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లిబియా దేశంలో అదృశ్యమయ్యారు. బొడ్డు దానయ్య, బచ్చల వెంకట్రావు, బచ్చల జోగారావులు వెల్డింగ్ పనుల నిమిత్తం గతేడాది అక్టోబర్ 31న లిబియా వెళ్లారు.
అక్కడ ఉపాధి నిమిత్తం ఓ ప్రైవేటు కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తున్నారు. వీసా గడువు ముగియడంతో భారత్కు విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈ విషయం తెలియజేయడం కోసం చివరిసారిగా ఈ నెల 14వ తేదీన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వాళ్లు పనిచేస్తున్న ప్రాంతంలోని బెంగాలియా ఎయిర్పోర్ట్ కరోనా కారణంగా మూసివేయబడిందని తెలిపారు. దీంతో కంపెనీ ఏర్పాటు చేసిన వాహనంలో 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపాలి విమానాశ్రాయానికి వస్తునట్లు చెప్పారు. ఈ నెల 17వ తేదీన దిల్లీ విమానాశ్రాయానికి చేరుకోవాల్సి ఉండగా చేరుకోలేదు.
అప్పటి నుంచి ఫోన్ చేసినా సమాచారం అందట్లేదని ఎంత ప్రయత్నించినా అందుబాటులో లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. కంపెనీ నిర్వాహకులు గాలించినా ఫలితం లేదని వివరించారు. వారం రోజులు గడిచినా తమవారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ వారి ఆచూకీ తెలియజేయాలని కుటుంబ సభ్యులు బొడ్డు సింహలమ్మ, బచ్చల గాంధీ, బచ్చల చిరంజీవి కోరుతున్నారు. దీనిపై వారు నౌపాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: రాజధానిపై విచారణ అక్టోబర్ 5కు వాయిదా