ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెంలోని గ్రామ సచివాలయాన్ని అధికార పార్టీలోని ఓ వర్గం అనధికారికంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్కి తెలియకుండానే వైకాపాలోని మరోవర్గం ప్రారంభించారు. సుమారు రూ. 40 లక్షల నిధులు వెచ్చించి నిర్మించిన ఈ పాలక భవనాన్ని సర్పంచ్ లేకుండానే దొడ్డిదారిన ప్రారంభించారు.
అధికారుల అనుమతి లేకుండానే..
సర్పంచ్ సహా అధికారులు లేకుండానే చోటా మోటా నేతలు కలిసి సచివాలయ ప్రారంభోత్సవ పూజలు జరిపించారు. ప్రోటోకాల్ నియమ నిబంధనలు పాటించకుండా కార్యక్రమం చేపట్టినప్పటికీ.. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గ్రామస్థులను విస్మయానికి గురి చేసింది.
సర్పంచ్ ఏమంటున్నారంటే..
సీఎం జగన్మోహన్ రెడ్డి గారూ.. నేను మీ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ను. కురిచేడులోని కొందరు వైకాపా నేతలు నాకు కనీస గుర్తింపు కూడా ఇవ్వట్లేదు. సర్పంచ్కు కానీ అధికారులకు కానీ సమాచారం లేకుండానే సుమారు రూ.40 లక్షల నిధులు వెచ్చించి నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. ఇలా మా గ్రామంలోనే కాదు ప్రతి చోటా వైకాపా రెండు వర్గాలుగా ఏర్పడి మీ పరిపాలనకు భంగం కలిగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మీ దృష్టికి తీసుకురావాలనే ముందుకు వచ్చాను. ఇప్పటికైనా మీరు గ్రామ స్థాయిలో జరుగుతున్న వర్గ రాజకీయాలపై దృష్టి సారించాలని.. ఇలాంటి సంఘటనలపై మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.
- శివలక్ష్మి, గ్రామ సర్పంచ్, కురిచేడు
ఇవీ చూడండి : గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన సీఎం జగన్