అతివేగం వల్ల ఒకరి మృతి చెందగా... మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లాలో 16వ నెంబర్ జాతీయరహదారిపై జరిగింది. విజయవాడ నుంచి ఒంగోలు వైపునకు అతి వేగంగా వెళుతున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతల రోడ్డుపై ఒంగోలు నుంచి విజయవాడ వైపు వెళుతున్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ రవి అక్కడికక్కడే మృతిచెందాడు. గుత్తేదారుల వద్ద రహదారి పనులు చేస్తున్న ఆరుగురు బిహార్ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. రేణంగివరం పోలీసులు వారిని 108 వాహనంలొ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ...
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలో జాతీయ రహదారి అండర్ పాస్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు.
తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన బొక్కా సాయి ఫణీంద్ర (19) ద్విచక్రవాహనంపై జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది . ఈ ప్రమాదంలో సాయి ఫణీంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు .
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళకు గాయాలు...
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ఇదీ చదవండి: ఉక్కు పరిశ్రమ ఉద్యోగి అదృశ్యం కేసులో... కొత్త కోణం!