సమాజంలోని కొందరు ఇంకా తాము బడుగు, బలహీనవర్గాల వారిమే అని చెప్పుకోవడానికి స్వస్తి పలికాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అమర్నాథ్ గౌడ్ సూచించారు. పొరుగువారికి సాయం చేయడాన్ని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని అన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ మంకెనవారిపాలెంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. ఆ తర్వాత అల్ఫ్రెడ్ అధ్యక్షతన నిర్వహించిన సభలో న్యాయమూర్తి మాట్లాడారు.
ఓ పేద కుటుంబం నుంచి అంబేడ్కర్ మహోన్నత స్థాయికి ఎదిగి ఎందరికో దిశానిర్దేశం చేశారని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ కొనియాడారు. అకుంఠిత దీక్షతో దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతంగా చదివించడానికి ముందుకు రావాలని.. అప్పుడే బాబా సాహెబ్ ఆశయాలు నెరవేరుతాయని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ అన్నారు. ఈ సందర్భంగా పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులకు రూ.25 వేల చెక్కును న్యాయమూర్తి చేతుల మీదుగా నిమ్స్ పరిపాలనాధికారి బడుగు రవికుమార్ నిర్వాహక కమిటీకి అందజేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.