ఉప్పుగుండూరు పంచాయతీ కార్యాలయం
కాలనీల్లో కొత్త కుళాయిలు మంజూరు చేస్తామని పంచాయతీ అధికారులు చెప్పడంతో అమాయక ప్రజలు నగదు చెల్లించేశారు. కనీసం రశీదులు కూడా ఇవ్వకుండానే అందరి దగ్గర బిల్లులు కట్టించుకున్నారు. ఆర్వో ప్లాంట్ నుంచి వచ్చిన ఆదాయాన్ని వక్ర మార్గాల్లో దారి మళ్లించారు. అడిగితే అంతా మా ఇష్టం అన్న సమాధానం ఇచ్చారు. చివరకు బాధితులు ముందుకొచ్చి సచివాలయాన్ని ముట్టడించడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా ఈ సంఘటన ఉప్పుగుండూరు జరిగింది.
ముందుగానే వసూళ్లు..
పేదలు గుక్కెడు తాగునీటి కోసం తపన పడి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు నగదు చెల్లించారు. గ్రామంలోని ఎస్సీ, పరబీడు కాలనీ, ఎస్టీ కాలనీ తదితర కాలనీల్లో నీటి కుళాయిల మంజూరుకు సుమారు 297 మంది డబ్బులు చెల్లించారు. ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.3,500 రూపాయల చొప్పున వసూలు చేశారు. వీటికి సంబంధించి రశీదులు కూడా ఇవ్వలేదు. సుమారు మూడు నెలలుపాటు ఇదిగో అదిగో అని మాయమాటలు చెప్పి అధికారులు తప్పించుకున్నారు. ఈ విషయం అంతా పంచాయతీ ప్రత్యేకాధికారికి తెలిసినా మిన్నకుండి పోవడం గమనార్హం.
నగదు దారి మళ్లింపు...
పంచాయతీ పరిధిలో నీటి కనెక్షన్లు ఇస్తామని సుమారు రూ.10.39 లక్షల వరకు పంచాయతీ అధికారులు వసూలు చేశారు. అసలు నగదు తీసుకున్నట్లు ఎలాంటి రశీదులు ఇవ్వకపోవడం.. ఇప్పటి వరకు కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేయకపోవడంతో సోమ్ములు పక్కదారి పట్టాయని సమాచారం. వాస్తవంగా వసూలు చేసిన నిధులను జనరల్ ఫండ్కు జమ చేయాల్సి ఉండగా అలా చేసిన దాఖలాలు లేవని ఇటీవల ఉన్నాధికారుల విచారణలో వెలుగుచూసింది. ఆర్వో ప్లాంట్లో తాగు నీటి విక్రయానికి సంబంధించి సుమారు ఏడాది కాలంలో సుమారు రూ.6 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధుల్లో సుమారు రూ.4 లక్షలు దారి మళ్లాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచారణ చేపట్టాం...
పంచాయతీలో నిధులు, కుళాయి కనెక్షన్ల మంజూరు నిమిత్తం నగదు తీసుకుని ఎలాంటి రశీదులు ఇవ్వలేదని తెలిసింది. దీనికి సంబంధించి ఆర్వో ప్లాంట్ ఆదాయ వ్యయాలు తదితర అంశాలపై విచారణ జరుగుతోంది. దస్త్రాల పరిశీలనతోపాటు ఫిర్యాదు దారుల నుంచి వివరాలు సేకరిస్తున్నాం. విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడిన పంచాయతీ సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. - నారాయణరెడ్డి, డీపీవో
ఇదీ చదవండి: గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారి.. రక్షించిన అగ్నిమాపక సిబ్బంది