శుద్ధ జలం బయట దుకాణాల్లో కొనాలంటే 10 రూపాయలు వరకు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. అందుకు భిన్నంగా ఇంట్లోనే 250 రూపాయల ఖర్చుతో నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టును తయారు చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలు క్విజ్ కళాశాల విద్యార్థులు. మనం ఇంట్లో ఉపయోగించే దూది, ప్లాస్టిక్ డబ్బాలు, బొగ్గు పొడి, కాటన్ వస్త్రం ఇవే ఆ ప్రాజెక్టుకు ఉపయోగించారు. పొలాల్లో పంటను జంతువుల బారి నుంచి కాపాడుకునేలా మరో ప్రాజెక్టును ఆవిష్కరించారు. పొలంలో జంతువుల కదలికలు పసిగట్టి రైతు చరవాణికి మెస్సేజ్ రావటం... జంతువులు భయపడే విధంగా అలారం మోగేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. నల్ల రేగడి, ఎర్రమట్టి నేల, పంటను బట్టి ఎంత నీరు పంటకు అవసరమో గుర్తించి అంతవరకే పంపు నుంచి నీరు పంటకు చేరేలా మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రూపొందించిన ప్రాజెక్టులు విద్యార్థులు గంగవరం గ్రామంలో రైతులు, గ్రామస్థులకు వివరించారు. అవసరమైన వారికి ఉచితంగా తయారుచేసి ఇస్తామని విద్యార్థులు హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆవిష్కరణలు స్వయంగా వీక్షించిన గ్రామస్థులు విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
ఇదీ చూడండి: విద్యార్థినుల ఆవిష్కరణ... పర్యావరణ పరిరక్షణ