రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు అత్యాధునిక సేవలందించేందుకు ఉద్దేశించిన కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ పనులకు ఇసుక కొరత సమస్యగా మారింది. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన ప్రాజెక్టులను ఆపేయాలన్న ప్రభుత్వ ఆదేశాల తర్వాత.. ఈ ఆస్పత్రి పనులు నిలిచిపోయాయి. ఇటీవల కర్నూలు మెడికల్ కళాశాలను సందర్శించిన వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి... క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రాధాన్యం దృష్ట్యా పనులు మళ్లీ ప్రారంభించాలని ఆదేశించారు. అయితే... మిగిలిన పనులు పూర్తి చేసేందుకు సుమారు 1500 టన్నుల ఇసుక అవసరం ఉంది. ఈ పరిస్థితిని అధికారులు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్కు సైతం నివేదించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో క్యాన్సర్ పరిశోధనా సంస్థ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లోని ఎం.ఎన్.జే తరహాలో... కర్నూలులో 200 పడకలతో స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ నిర్మించాలని గత ప్రభుత్వం తలపెట్టింది. 120 కోట్ల... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఆస్పత్రి నిర్మించాల్సి ఉండగా... ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం 54, రాష్ట్రం 36 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశాయి. అయినా... ఇసుక కొరత కారణంగా ఆసుపత్రి నిర్మాణం ముందుకు సాగడం లేదు.
'కే' ఆకారంలో చేపడుతున్న భవన నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి, తొలిదశలో రేడియేషన్, మెడికల్, సర్జికల్ అంకాలజీ విభాగాలు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. 4 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, లుకేమియా కేసులకు చికిత్స, 40 పడకలు, రక్తనిధి లాంటి సౌకర్యాలు సమకూర్చనున్నారు. రెండో దశలో న్యూక్లియర్ మెడిసిన్ సహా మిగిలిన విభాగాలు సిద్ధం చేయనున్నారు. పనుల జాప్యం కారణంగా ఈ సౌకర్యాలన్నీ క్యాన్సర్ రోగులకు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
పాముకాటుకు గురై ప్రభుత్వాసుపత్రికి వస్తే... స్పందించని వైద్యులు