కోర్టు ధిక్కరణ కేసులో కర్నూలు జిల్లా సి.బెళగల్ తహసీల్దార్ జె.శివశంకర నాయక్కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఓ రైతుకు చెందిన భూమి మ్యుటేషన్కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం అమలుచేయకపోవడంతో ఎమ్మార్వో.. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ధ్రువీకరించిన కోర్టు.. ఈమేరకు తీర్పు వెల్లడించింది.
సి.బెళగల్ మండలం ముడుమాల గ్రామానికి చెందిన పింజరి కరీం సాబ్ ..అదే మండల పరిధిలోని కొత్తకోట గ్రామం సరిహద్దులో సర్వే నెం. 430/ 1లో 11 ఎకరాల 73 సెంట్ల తన సొంత భూమిలో వ్యవసాయం చేస్తూ..జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తన భూమికి సంబంధించి మ్యుటేషన్ నిమిత్తమై స్థానిక ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో గ్రామ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన ఆయన.. కరీం సాబ్ దరఖాస్తును తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కరీం సాబ్ తనకు న్యాయం చేయాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. సంబంధిత రైతు మ్యుటేషన్ కోసం చేసుకున్నదరఖాస్తును తిరస్కరిస్తూ.. సి.బెళగల్ ఎమ్మార్వో ఇచ్చిన ఆదేశాలు చెల్లవని,మ్యుటేషన్ చేయాలని ఆదేశించింది.
కాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం అమలుచేయకపోవడంతో ఎమ్మార్వో శివశంకర నాయక్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ధ్రువీకరించిన కోర్టు.. ఆయనకు ఆరు నెలల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.2,000లు జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు వారాలు జైలుశిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది.
ఇదీ చదవండి: AOB: గిరిజనులతో మమేకం.. భద్రతా బలగాల నృత్యం!