జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున 2022కి కార్యకర్తలు సిద్ధం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జమిలి రాకుంటే 2014 ఫలితం 2024 లో పునరావృతం కావాలని ఆకాంక్షించారు. విజయవాడలో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారీ సమీక్షలు రాత్రి వరకూ సాగాయి. తొలిరోజు పెడన, కైకలూరు, మచిలీపట్నం, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.
ఆత్మవిమర్శ చేసుకోవాలి
పలు నియోజకవర్గాల సమీక్షలో లోటుపాట్లను కార్యకర్తలు అధినేతకు కుండ బద్దలు కొట్టినట్లు వివరించారు. పెడన నియోజకవర్గం సమీక్షలో అభ్యర్థి టిక్కెట్ను చివరి నిమిషం వరకూ నాన్చటంతోనే.. స్వల్ప తేడాతో ఓడిపోయామని తెలిపారు. అయిదేళ్లు అధికారంలో ఉండగా కార్యకర్తలకు తగు న్యాయం జరగలేదనే అభిప్రాయాన్ని కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పార్టీకి ఒక్కొక్కరు ఎన్ని ఓట్లు వేయించారనే ఆత్మవిమర్శ చేసుకోవాలని.. చంద్రబాబు అన్నారు.
మీరు మారాలి
కైకలూరు సమీక్షలో 2014లో భాజపా అభ్యర్థిని గెలిపించిన క్యాడర్ తాజా ఎన్నికల్లో సొంతపార్టీ అభ్యర్థిని గెలిపించలేకపోవటానికి గల కారణాలను చంద్రబాబు విశ్లేషించారు. అభివృద్ధిపై దృష్టి సారించి రాజకీయాలను పట్టించుకోకపోవటం వల్లే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని.. ఈ విషయంలో అధినేత వ్యవహార శైలి మారాలని కొందరు కార్యకర్తలు సూటిగా స్పష్టం చేసినట్లు సమాచారం.
తిరువూరు ఓటమిపై అసంతృప్తి
మచిలీపట్నం, జగ్గయ్యపేట నియోజకవర్గ సమీక్షలో పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామనే నమ్మకాన్ని నేతలు వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట సమీక్షలో నేతలు విభేదాలు విడి సమన్వయంతో పని చేయాలని అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తిరువూరు నియోజక వర్గంలో వరుస ఓటమి పట్ల బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
రెండో రోజు సమీక్ష
కృష్ణా జిల్లా తెదేపా నేతలతో చంద్రబాబు రెండో రోజు సమీక్ష ఇవాళ కొనసాగనుంది. మెుదట వైకాపా నేతలు కేసులు పెట్టిన బాధితులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం అయిదు నియోజకవర్గాల నేతలతో అధినేత ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అవనిగడ్డ, నందిగామ నేతలతో.. సాయంత్రం పామర్రు, నూజివీడు నేతలతో, రాత్రికి గుడివాడ నియోజకవర్గ సమీక్షను చంద్రబాబు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి:జగన్ పాలన ఏంటో కేసీఆర్కూ తెలిసిపోయింది: చంద్రబాబు