Principal Misbehaviour: విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రిన్సిపల్ ఆ విద్యాసంస్థలో పనిచేస్తున్న ఉద్యోగినితో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూడడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మచిలీపట్నంలోని ఏపీ మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న బి.ఆనందకుమార్ అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగినితో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలు శనివారం సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూశాయి. ఈ అంశంపై జిల్లా విద్యాశాఖాధికారిణి ఆదేశాల మేరకు డీవైఈవో యూవీ సుబ్బారావు గురుకుల పాఠశాలలో విచారణ నిర్వహించారు. వీడియోలు పరిశీలించిన ఆయన పాఠశాలలోని విద్యార్థులు, అధ్యాపకుల నుంచి వివరాలు సేకరించారు. శాఖాపరమైన చర్యల నిమిత్తం నివేదికను ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శికి అందజేస్తున్నట్టు తెలిపారు. ఏపీ రెసిడెన్షియల్ సొసైటి కార్యదర్శి ఉబేదుల్లా రాత్రి పాఠశాలకు విచ్చేసి సంఘటనపై విచారించారు.
కొంత కాలంగా ఇదే తీరు: ప్రిన్సిపల్తో సంబంధం పెట్టుకున్న ఆమె గతంలో ఉపాధ్యాయినిగా పనిచేసేవారు. వివిధ కారణాలతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించగా ఇటీవలే ఖాళీగా ఉన్న పోస్టులో చేరారు. కొంతకాలంగా ఇద్దరూ పాఠశాలలోనే అభ్యంతకరంగా వ్యవహరిస్తుండటాన్ని తోటి సిబ్బంది గుర్తించారు. దీనికి తోడు ఆమె చెప్పిన మాటే ప్రిన్సిపల్ పాటిస్తుండటంతో ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయారు.ఈ నేపథ్యంలో వీడియోలు బయటకు వచ్చాయి.
కేసు నమోదు: వీడియోలను విద్యార్థులే తీశారన్న అనుమానంతో వారిలో కొందరిని ప్రిన్సిపల్ ఆనందకుమార్ బెదిరించారు. వారిలో ఆకాష్ అనే విద్యార్థి ప్రిన్సిపల్పై చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనను అకారణంగా కొట్టారని మాత్రమే ఫిర్యాదు చేయడంతో ఆమేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ రాజశేఖర్ తెలిపారు. ఇతర అంశాలేవైనా ఉంటే సంబంధిత శాఖాపరంగా చూసుకుంటారని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: