ఆక్సిజన్ వినియోగాన్ని అంశాల వారిగా పర్యవేక్షించేందుకు 7 బృందాలను నియమిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ వెల్లడించారు. నగరంలోని కొవిడ్ కంట్రోల్ కేంద్రంలో ఆక్సిజన్ మానిటరింగ్ టీమ్ అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి ఆస్పత్రికి ఆక్సిజన్ అవసరాలను అంచనా వేసి .. సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి 2 బృందాలు పని చేస్తాయని చెప్పారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి కృష్ణా జిల్లాకు కేటాయించిన ఆక్సిజన్తో కూడిన వాహనాలు ఉత్పత్తి కేంద్రాల నుంచి జిల్లాకు చేరే వరకు ఈ బృందాలు అనుక్షణం పర్యవేక్షిస్తాయని చెప్పారు. వీరిని రవాణా శాఖ నుంచి ఒక అధికారి సమన్వయం చేసుకుంటారన్నారు. గ్రీన్ ఛానెల్లో వాహనాలు జిల్లాకు చేరేలా పోలీసు అధికారులు పనిచేస్తారన్నారు. విజయవాడ, మచిలీపట్నంలోని ప్రభుత్వ , పిన్నమనేని, నిమ్ర కొవిడ్ ఆస్పత్రులకు ప్రాణవాయువు సరఫరా, వినియోగం నిల్వలు ఎప్పటికప్పుడు ఈ బృందాలు పర్యవేక్షిస్తాయన్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించారు: మంత్రి ఆళ్ల నాని