విద్యార్థుల భవిష్యత్తు కోసమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పరీక్షలు రద్దుచేయడం చాలా సులభమని, అన్ని జాగ్రత్తలతో నిర్వహించడమే కష్టమని చెప్పారు. విద్యార్థుల కోసం కష్టతరమైన మార్గాన్నే ఎంచుకున్నామన్నారు. రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు గురించి తనకన్నా ఎక్కువ ఆలోచించేవారు ఎవరూ ఉండరన్నారు. వారి కోసం పలు పథకాలు అమలుచేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి విపత్కర సమయంలోనూ కొందరు రాజకీయ ప్రయోజనం కోసం అగ్గి పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి రెండో ఏడాది జగనన్న వసతిదీవెన కింద 10.89 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,048.94 కోట్లను సీఎం జగన్ బుధవారం మీట నొక్కి జమచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మంచి కళాశాలల్లో సీట్లు ఎలా?
‘అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదు. కేంద్రం కొన్ని నిర్ణయాలను రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని రద్దు చేస్తున్నాయి. పరీక్షలు నిర్వహించకపోతే కేవలం పాసైనట్లు ధ్రువపత్రం ఇస్తారు.
పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకున్నవారితో మన విద్యార్థులు ఎలా పోటీ పడతారు? వారికి మంచి కళాశాలల్లో సీట్లు ఎలా వస్తాయి? పదో తరగతిలో కేవలం పాస్ మార్కులతో బయటికి వచ్చిన విద్యార్థి భవిష్యత్తు ఏమిటి?’ అని ప్రశ్నించారు. పరీక్షలు రాసినవారి మార్కులు బాగుంటే.. కేవలం పాస్ మార్కులతో ధ్రువపత్రాలున్న మన పిల్లలకు ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు ఎలా వస్తాయనే విషయాన్ని తల్లిదండ్రులు ఆలోచించాలన్నారు.
ఉన్నత చదువులే పిల్లలకు ఇచ్చే ఆస్తి
‘ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి. రాబోయే రోజుల్లో మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడి గెలవాలన్న ఉద్దేశంతోనే ముందడుగు వేస్తున్నాం. పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న ఆలోచనతో పూర్తి ఫీజు చెల్లిస్తున్నాం. రవాణా, వసతి, మెస్ ఖర్చులను అందిస్తున్నాం. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఆపై చదివేవారికి రూ.20వేల చొప్పున అందిస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది చదువుతున్నా అందరికీ వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. తల్లుల ఖాతాలో పడిన సొమ్ముతో ఫీజు కట్టడం వల్ల.. కళాశాల యాజమాన్యాలను వారు నిలదీయొచ్చు. యాజమాన్యాలు స్పందించకపోతే 1902కు ఫోన్ చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది’ అన్నారు.
డ్రాపవుట్లు తగ్గాయి...
‘జగనన్న వసతిదీవెన, విద్యాదీవెన పథకాల వల్ల డ్రాపవుట్లు తగ్గాయి. చదువులపై పెట్టే ఖర్చు విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి అని నేను గట్టిగా నమ్ముతున్నా. గత 23 నెలల్లో వివిధ పథకాల ద్వారా 1.60 కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం కలిగేలా రూ.25,714.13 కోట్లు ఖర్చుచేశాం. పేద విద్యార్థులు... ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్లమాధ్యమ విద్యాబోధన చేయబోతున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలుచేస్తాం. అంగన్వాడీలను వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్చి ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన చేయబోతున్నాం. పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలబడేలా ఇంటర్న్షిప్, పని అనుభవం, డిగ్రీలో నైపుణ్యం పెంచేలా కరికులమ్లో మార్పులు తీసుకువచ్చాం’ అని తెలిపారు.
విద్యార్థులకు అండగా సీఎం జగన్: ఆదిమూలపు సురేష్
కరోనా కష్టకాలంలోనూ ఏ ఒక్క పథకాన్నీ ఆపకుండా అమలు చేస్తూ సీఎం జగన్ విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ అని చెప్పి అరకొరగా సాయం అందించారన్నారు. పేద విద్యార్థుల ఉన్నతవిద్యకు విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు ఉపయోగపడుతున్నాయని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తేజేశ్వరరావు, నెల్లూరు జిల్లా నుంచి హారిక, కాకినాడ నుంచి ఇష్రత్ ఫర్హీన్, ప్రకాశం జిల్లా నుంచి విద్యార్థిని తల్లి రమణమ్మమాట్లాడారు.
మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్
ఇంటర్ పరీక్షలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వర్చువల్ సమీక్ష జరిపారు. జేసీలు, ఆర్ఐవో, డీఈవోలతో మాట్లాడిన ఆయన..షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఇంటర్ పరీక్షలు అనివార్యమని అందరూ గుర్తించాలని తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదని గుర్తు చేశారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పూర్తి చేసిన అధికారులకు మంత్రి సురేష్.. అభినందనలు తెలిపారు. ఇంటర్ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు.
ఇవీ చదవండి