AP CRIME NEWS : కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటు చేసుకుంది. అప్పులు తీర్చలేక చేనేత కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఉరివేసుకుని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు పద్మనాభం(52), నాగ లీలావతి(45), రాజా నాగేంద్ర(25)గా పోలీసులు గుర్తించారు. ఐదు నెలల క్రితం పద్మనాభం, లీలావతి దంపతులు.. కుమార్తెకు వివాహం చేశారు. నిన్న రాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఎంతవరకు అప్పులు ఉన్నాయనేది దర్యాప్తు జరుపుతున్నారు.
నాటుసారా స్థావరాలపై దాడులు
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామం సమీపంలో అక్రమంగా తయారు చేస్తున్న సారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేసి, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విశాఖలో విగ్రహ ధ్వంసం
విశాఖ జిల్లా భీమిలిలో ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసం ఘటన కలకలం రేపింది. స్థానిక స్మిత్ వీధిలో సోమవారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. అభయ ఆంజనేయ స్వామి గుడిలో చొరబడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కనుమదారిలో ప్రమాదం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమదారిలో ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో లారీ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్రగాయాలు కాగా.. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి