మహిళా ఐకాస నేతలపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుల దాడిని నిరసిస్తూ గుంటూరు జిల్లా రైతులు నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెదపరిమిలో..
మహిళా ఐకాస నేతలపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుల దాడిని నిరసిస్తూ గుంటూరు జిల్లా పెదపరిమిలో మహిళలు, రైతులు ఆందోళనకు దిగారు. పెదపరిమి కూడలిలో నందిగం సురేష్కు వ్యతిరేకంగా, అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం మహిళలు, రైతులు మానవహారంగా ఏర్పడ్డారు. మహిళలపై దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కృష్ణాయపాలెంలో..
రైతుల సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని మంగళగిరి మండలం కృష్ణాయపాలెం మహిళలు వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. వైకాపా నేతలు రాజధానిలో ఎప్పుడైనా పర్యటించ వచ్చని.... అదే సమయంలో తమ ఉద్యమాన్ని చులకనగా మాట్లాడితే సహించబోమని తేల్చిచెప్పారు. తామంతా శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నామన్నారు. మహిళా ఐకాస నేతలపై దాడిని వారు ఖండించారు.