Irregularities in AP Voter List: రాష్ట్రంలో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన శిబిరాల్లో తొలిరోజు చిత్ర విచిత్రాలు వెలుగుచూశాయి. గుంటూరులోని మాజేటి గురవయ్య ఉన్నత పాఠశాల కేంద్రంలో ముసాయిదా జాబితా చూసిన ఓటర్లు అవాక్కయ్యారు. ఒక కుటుంబంలో 6 ఓట్లకు 3 ఓట్లే ఉన్నాయని ఓ వ్యక్తి వాపోయారు. ఏటీ ఆగ్రహారంలోని ఎస్కేబీఎమ్ పాఠశాల కేంద్రానికి చిరునామా మార్చలేదంటూ ఓటర్లు వచ్చారు. నాలుగైదుసార్లు దరఖాస్తు చేసినా నేటికీ జాబితాలో పాత అడ్రస్సే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతాజీ నగర్ 29వ డివిజన్ పరిధిలోని ఒకే కుటుంబంలోని ఓట్లు వేర్వేరు బూత్లలో ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఓటర్ నమోదు శిబిరాల వద్ద వాలంటీర్లు హడావుడి చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నూజెండ్ల మండలంలో ఓట్ల చేర్పులు, మార్పులపై స్థానిక నేతలు తహసీల్దారుతో వాదనకు దిగారు. ఈపూరు మండలం ముప్పాళ్లలో ఓటు తొలగింపునకు నోటీసులివ్వడంపై బీఎల్వోలను గ్రామస్తులు నిలదీశారు. గ్రామంలో 145 మంది ఓట్లు తొలగించాలని వైసీపీ నేతలు ఫారం-7 దరఖాస్తులు పెట్టడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఓటర్ జాబితాలో కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు - బీఎల్వోల పనితీరుపై విమర్శలు
బాపట్ల నియోజకవర్గంలో3 వేల మందికిపైగా మరణించిన వారి ఓట్లు జాబితాలో దర్శనమిచ్చాయి. డబ్లింగ్ ఓట్లు 4 వేల 213 మందిని గుర్తించి వారికి అధికారులు నోటీసులు పంపారు. ముత్తాయపాలెంలో 101వ పోలింగ్ కేంద్రంలో బీఎల్వోలు అందుబాటులో లేకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో ప్రత్యేక కేంద్రాల్లో ఓటరు నమోదు మెక్కుబడిగా సాగింది. బందరు, గన్నవరం, అవనిగడ్డలో బీఎల్లోలు సమయపాలన పాటించలేదు.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 180వ పోలింగ్ బూత్ లో 74 మంది మృతుల పేర్లను తొలగించలేదు. విజయవాడ గౌతమినగర్ 171వ బూత్లో 20వ డివిజనుకు చెందిన 600 ఓట్లు 21వ డివిజన్లోకి వెళ్లాయని దరఖాస్తులు వచ్చాయి. విజయవాడ సెంట్రల్లోనూ భారీగా మృతులు, డబుల్ ఎంట్రీలు గుర్తించారు. తిరువూరులో విశాఖ, నూజివీడు, హైదరాబాద్, ఖమ్మం పిడుగురాళ్లలో స్థిరపడిన 50 కుటుంబాలకు చెందిన ఓట్లు ఉన్నా తొలగించలేదు. జగ్గయ్యపేటలో డబుల్ ఎంట్రీలపై స్థానిక నేతలు బీఎల్వోల ఎదుట అభ్యంతరం వ్యక్తం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు బంపర్ ఆఫర్ - ఒక్కొక్కరికి రెండు ఓట్లు!
అనంతపురం జిల్లా ఉరవకొండ జడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రంలో బీఎల్వోలు కనిపించలేదు. కూడేరు మండలం మరుట్ల 3వ కాలనీ 229 పోలింగ్ కేంద్రంలో బీఎల్వో విధులకు హాజరు కాలేదు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో బీఎల్వోలను సిత్రాల నాగరాజు అనే వ్యక్తి నిలదీశారు. తమ ఓటును వేరే ప్రాంతానికి ఎలా మార్చారని ప్రశ్నించారు. కర్నూలులో ఓటరు జాబితాలో పేర్లు లేవని అధికారులను స్థానికులు నిలదీశారు. నంద్యాల జిల్లాలో 10 వేల దొంగ ఓట్లను తొలగించాలని కలెక్టరుకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అక్రమంగా ఫాం-7 దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఓటరు జాబితాలో లోపాలపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. టెక్కలిలో మృతులు, వలస వెళ్లినవారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లను గుర్తించారు. పాతనౌపడాలో 00 ఇంటినెంబరుతో ఉన్న 42 ఓట్లు గుర్తించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో మృతుల ఓట్లు జాబితా నుంచి తొలగించలేదని అధికారులకు ఫిర్యాదు అందింది. ఏలూరులో 141వ పోలింగ్ కేంద్రంలో ఓ ఇంటి నంబరులో దొంగ ఓట్లను గుర్తించారు. భీమవరం, తణుకులో ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలకు స్పందన కరవైంది.
పర్చూరులో ఒకే వ్యక్తికి మరో చోట ఓటు - బీఎల్వోలతో ఎన్నికల సంఘం విచారణ
నెల్లూరు జిల్లాలో ముసాయిదా జాబితా ప్రత్యేక కేంద్రాల్లో కొత్త ఓటర్ల నమోదు మొక్కుబడిగా సాగింది. ఈనాడు ఈటీవీ భారత్ బృందం 243 కేంద్రాలను పరిశీలించగా చాలా చోట్ల బీఎల్వోలు అందుబాటులో లేరు. కావలి, ఆత్మకూరు కేంద్రాల్లో మధ్యాహ్నం భోజనం తర్వాత కేంద్రాలకు రాలేదు. ఆత్మకూరులో 133 బూత్లో 4-2-3-79 ఇంటి నెంబర్లో 127 ఓట్లు గుర్తించారు. నందిపాడు, వెంకంపేట, పాపంపల్లి, కొండికందుకూరులో బీఎల్వో రాలేదు. నెల్లూరు ఆర్ఎస్ఆర్ పాఠశాల కేంద్రంలో చెట్ల కింద సిబ్బందికి బల్లలు వేశారు. గదిలేకపోవడంతో వర్షానికి బల్లలు ఎత్తుకుని వెళ్లిపోయారు.
ఏపీలో అక్రమాల సిత్రాలు- సమగ్ర పరిశీలన తర్వాత కూడా తప్పులతడకగా ఓటర్ల జాబితా