జిల్లా నుంచి మత్తు పదార్థాల వాడకాన్ని దూరం చేసేందుకు మాస్టర్ వాలంటీర్స్ కృషిచేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. రాజమండ్రిలోని కలెక్టర్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్త భారత్ మాస్టర్ వాలంటరీ శిక్షణా కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి నషాముక్త భారత్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం గురించి మాస్టర్ వాలంటీర్స్ అవగాహన పెంచుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని బయటపడేసేందుకు వాలంటీర్లు కృషిచేయాలన్నారు. ఈ పథకం జిల్లాలో సక్రమంగా అమలయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
జాయింట్ కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వాడకం నుంచి విముక్తి కోసం కేంద్ర ప్రభుత్వం నషాముక్త భారత్ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. దీని కింద గుర్తించిన 272 జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా ఒకటని అన్నారు. ఈ పథకాన్ని జిల్లాలో అమలు చేయుటకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. 50 మంది మాస్టర్ వాలంటీర్లను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. పథకం యొక్క ఆవశ్యకత, మత్తు పదార్థాల వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలపై వారు ప్రజలకు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు.
ఇవీ చదవండి...