చిత్తూరు జిల్లా పీలేరులో అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా సభ్యులు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి 30 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అందులో 15 అధిక ధర కలిగిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు ఉన్నట్లు వెల్లడించారు. ఏపీ, కర్ణాటకల్లోని పలు జిల్లాల్లో చోరీ చేసిన ఈ వాహనాల మొత్తం విలువ సుమారు రూ.45లక్షల వరకు ఉంటుందన్నారు.
పోలీసుల దర్యాప్తులో...
ఇటీవల పీలేరు పట్టణానికి చెందిన వ్యక్తి బుల్లెట్ బైక్ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి దర్యాప్తు చేపట్టగా.. మదనపల్లి మార్గంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు సేకరించగా.. తమతో పాటు మరో ఐదుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడినట్లు తెలిపారు. వారి నుంచి బైక్ల దొంగతనానికి వినియోగించిన స్క్రూడ్రైవర్, డూప్లికేట్ తాళాలు, ఫ్లగ్ వైరు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ ఆర్సీలతో అమ్మకాలు..
ఈ ముఠాకు అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన సుమంత్ బాబు అలియాస్ పులి గ్రూప్ లీడర్గా వ్యవహరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అతనిపై ఇప్పటికే కర్ణాటకలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన అధునాతన బుల్లెట్ బైక్లతో పాటు ఇతర ద్విచక్ర వాహనాలను ఓఎల్ఎక్స్ వంటి అంతర్జాల వేదికల ద్వారా తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు నిందితులు తెలిపారు. చోరీ చేసిన వాహనాలకు సంబంధించిన ఆర్సీలను ఓ ఫోటో స్టూడియో యజమాని వద్ద నకిలీ కార్డులను తయారుచేయించి కొనుగోలుదారులకు అందజేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసు ఛేదించేందుకు సహకరించిన పీలేరు సీఐ సాధిక్ అలీ, ఎస్సై తిప్పేస్వామి, సిబ్బందికి జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
ఇదీ చదవండి: వేటపాలెంలో పట్టు చోరీ చేస్తున్న వ్యక్తులు అరెస్ట్