- ఈ చిత్రంలో కన్పిస్తున్నది కేవీబీపురం గురకలకండ్రిగ చెరువు. అధికారికంగా.. అనధికారికంగా దాదాపు 400 ఎకరాల ఆయకట్టు ఉంది. గతేడాది నివర్ తుపాన్ సందర్భంగా చెరువుకు గండి పడటంతో సాగునీరంతా వృథా అయింది. పూర్తి స్థాయిలో గండిని పూడ్చని కారణంగా వర్షాలకు చెరువులోకి నీరు చేరినా నిల్వ ఉండదని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
- శ్రీకాళహస్తి మండలం కొత్తపల్లిచింతల చెరువు కింద ఇది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి ఎకరాల ఆయకట్టు కలిగిన ఈ చెరువుకు గతేడాది నివర్ తుపాన్ సందర్భంగా గండి పడటంతో సాగునీరంతా వృథాగా పోయింది. జలవనరుల శాఖ అధికారులు తాత్కాలికంగా ఇసుక బస్తాలతో సాగునీటి వృథాను అరికట్టినా శాశ్వత పనులు చేయలేకపోయారు.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా చెరువులు ఉన్నవి.. తూర్పు మండలాల్లోనే. గతేడాది చివరన నివర్ తుపాన్ ప్రభావంతో పలు చెరువులు దెబ్బతిన్నాయి. ఇక్కడి జలవనరుల శాఖ డివిజన్ పరిధిలో 897 చెరువులకు 205 వరకు దెబ్బతిన్నాయి. వీటికి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేందుకు రూ.113.42 లక్షల వ్యయంతో అధికారులు నివేదికలు సిద్ధం చేసి పంపారు. ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. నిధులు వస్తే పనులు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ఆందోళనలో రైతులు
నివర్ తుపాన్ కారణంగా ఊహించని నష్టాన్ని చవిచూసిన ఆయకట్టు రైతులు అప్పట్లో అధికారుల సాయంతో తాత్కాలికంగా పరిష్కరించుకున్నారు. పలు చెరువులకు గండ్లు పడటంతో ఇసుక బస్తాలు వేసి నీటి వృథాను నియంత్రించారు. శాశ్వతంగా పనులు జరిగితేనే చెరువులు నిండుకుండల్లా కన్పించే అవకాశం ఉంది. గతేడాది డిసెంబరులో జరిగిన నష్టాన్ని పూడ్చే విధంగా శాశ్వత ప్రాతిపదికన పనులు జరగలేదు. మళ్లీ వర్షాలు సమీపిస్తున్నాయి. ఆలోపు గండ్లు పూడ్చకుంటే కడగండ్లు తప్పవు మరి. ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జలవనరుల శాఖ అధికారులు నిధులు కోసం నిరీక్షిస్తున్నారు. నిధులు రాగానే శాశ్వత ప్రాతిపదికన గండ్లు పూడ్చే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉన్నతాధికారులు స్పందించి చెరువులకు శాశ్వత పనుల కోసం నిధులు మంజూరు చేయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.