రాష్ట్ర ప్రజల కల నెరవేరింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. విభజన సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కేంద్రం కాసేపటి క్రితమే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కేంద్రంగారైల్వే జోన్ ప్రకటించింది. దక్షిణ కోస్తారైల్వేగా జోన్ కు నామకరణం చేసింది.విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో విశాఖపట్నం జోన్ను కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. జోన్ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. జోన్ ఏర్పాటు దిశగా త్వరలోనే చర్యలు పూర్తి చేస్తామన్నారు. భాగస్వాములు అందరితో చర్చించామనీ.. రైల్వే జోన్ పై విస్తృతంగా అధ్యయనం చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచింది. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర ప్రజల డిమాండ్ను ఎలుగెత్తింది. జోన్ విషయంలో ఇన్నాళ్లూ మీనమేషాలు లెక్క పెట్టిన కేంద్రం... చివరికి రాష్ట్ర ప్రజల న్యాయమైన డిమాండ్ను గౌరవించింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న తరుణంలో... విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించింది.