ఉండవల్లి వేదికగా జరుగుతున్న రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసగించారు. తొలుత వారాంతపు సెలవు(వీక్లీ ఆఫ్ )లపై పోలీసు శాఖలోని కమీటి ఇచ్చిన నివేదికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆయన...ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు నియంత్రించేలా తగిన చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలోని 6 మండలాల్లో గంజాయి సాగవుతోందని, వాటిని ఆరికట్టేందుకు రెవెన్యూ, ఎక్సైజ్, పోలీసు శాఖలు సంయుక్తంగా పనిచేయాలని చెప్పారు. కాఫీ సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని సూచించారు.
కాల్మనీ కేసులపై సీఎం ఆగ్రహం
కాల్మనీ కేసులపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని.. ఏ పార్టీవారున్నా విడిచిపెట్టొదని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. ఫిర్యాదు ఉంటే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగటం దారుణమని సీఎం వ్యాఖ్యానించారు.
గ్రీవెన్స్ సెల్కు ఐఏఎస్ అధికారి నేతృత్వం
ప్రజల ఫిర్యాదులు, పరిష్కారానికి శాశ్వతంగా గ్రీవెన్స్ కార్యాలయం పెట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్యలను పారదర్శకత, వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. గ్రీవెన్స్ సెల్ కు ఐఏఎస్ అధికారి నేతృత్వం వహించేలా ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలన్న సీఎం...కాలుష్యంపై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కాలుష్యంపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసినా సానుకూలంగా పరిశీలన చేయాలని సీఎం తెలిపారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భవిష్యత్ తరాలకు చేటు తెచ్చే పరిస్థితి ఉండకూడదని సీఎం ఆకాంక్షించారు.