అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో చిట్టీలు, పొదుపు ఖాతాల పేరుతో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి పరారైన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని సత్యనారాయణపేటకు చెందిన విజయలక్ష్మి అనే మహిళ చిట్టీల సంస్థను ప్రారంభించింది. కొంతమంది ఏజెంట్లను నియమించుకుంది. తమ దగ్గర చిట్టీలు, పొదుపు చేస్తే.. సంవత్సరం తర్వాత రెట్టింపు డబ్బు ఇస్తానని నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన స్థానికులు పెద్ద ఎత్తున డిపాజిట్ చేశారు.
రూ.12 కోట్ల వరకు వసూలు చేసి..సమయం చూసుకుని ఉడాయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టి మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటిదాకా ఆమె దాాదాపు వెయ్యి మందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. సదరు మహిళ నుంచి 100 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు మూడు ద్విచక్ర వాహనాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలితో పాటు పది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. అనధికారికంగా చిట్టీలు, పొదుపు ఖాతాల పేరిట డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: గరుగుబిల్లి ఎంపీడీఓ వికృత చేష్టలు.. సస్పెన్షన్ వేటు