అనంతపురం జిల్లా రాప్తాడులో 3 రిజర్వాయర్ల నిర్మాణంపై తెదేపా నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. మాజీమంత్రి దేవినేని ఉమా, పరిటాల శ్రీరాం విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలని సూచించారు. పరిటాల రవి చనిపోయాకే 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా పనులు ప్రారంభించారని వివరించారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరుకు నీరు ఇవ్వాలని తాము 2007 నుంచీ పోరాడుతున్నామని.. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా జీవో విడుదల చేసి నామమాత్రంగా పనులు చేసి వదిలేసిందని తెలిపారు.
ఒకే రిజర్వాయర్కు రూ.803 కోట్లు అంచనా వ్యయం రూపొందించి దోపిడీ చేసేందుకు ప్రయత్నించగా.. తాము రివర్స్ టెండరింగ్ చేసి అదే అంచనా వ్యయంతోనే 3 రిజర్వాయర్ల పనులు చేపట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము సరిదిద్దుతున్నామన్న ఎమ్మెల్యే... తప్పు చేసినందుకు దేవినేని ఉమా ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఒక్క రిజర్వాయర్ స్థానంలో 3 రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. పేరూరు డ్యాంకు నీరివ్వాలంటే గతంలో తెదేపా నేతలు అవహేళన చేశారని.. తాము పేరూరు డ్యాంకు నీరు ఇచ్చామని వివరించారు.
ఇదీ చదవండీ... 5 శాతం ఓట్లు మళ్లితే వైకాపా ఇంటికే : చంద్రబాబు