పదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో అడుగుపెట్టిన సుబ్బులక్ష్మిరాణా పుట్టినిల్లు తమిళనాడులోని తిరునల్వేలి. తల్లికి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి అంటే అభిమానం. ఎప్పటికైనా ఆమెలా గొప్ప కళాకారిణి కావాలని కూతురుకి ఆమె పేరే పెట్టింది. తల్లి కోరుకున్నట్టుగానే సుబ్బులక్ష్మి కూడా చదువుకన్నా... డ్యాన్స్నే ఎక్కువగా ప్రేమించేది. తండ్రి చొక్కలింగం సైన్యంలో కల్నల్గా విధులు నిర్వహించేవారు.
ఆయనతోపాటు దేశమంతటా తిరగడంవల్ల ఆమె ఆలోచనలు విస్తృతం అయ్యాయి. అలహాబాద్లో డిగ్రీ పూర్తి చేసిన సుబ్బులక్ష్మి... చెన్నైలోని ప్రఖ్యాత కళాక్షేత్ర ఫౌండేషన్లో చేరడం తన జీవితంలో గొప్ప అనుభవం అంటారు. ‘సాధారణంగా ఇంటర్ పూర్తిచేసి వచ్చే అభ్యర్థులకు మాత్రమే అక్కడ ప్రవేశం దొరుకుతుంది. అప్పటికే నాకు డిగ్రీ కూడా అయింది. అయినా ప్రయత్నించి కళాక్షేత్రలో చోటు సంపాదించాను.
అక్కడ నాలుగేళ్ల డిప్లొమా, ఆ తరువాత రెండేళ్ల పీజీ చేశాను. మొత్తం ఆరేళ్ల కాలం నా జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చాయి. భరతనాట్యం నా జీవితంలో ఓ భాగమైపోయింది. దేశమంతా తిరిగి ఎన్నో ప్రదర్శనలిచ్చాను. అయితే సృజనాత్మకతను జోడించి ఆధునిక నృత్యరూపకాలను ప్రదర్శించినప్పుడు ప్రేక్షకుల నుంచి స్పందన ఎక్కువగా వచ్చేది. ఆ స్పందనే ‘నృత్యకథ’ ఆలోచనకు ప్రాణం పోసింది’ అంటారు సుబ్బులక్ష్మి.
కథలు అలా మొదలు...
ప్రదీప్రాణాతో పెళ్లి అయిన తరువాత హైదరాబాద్కు చేరుకున్న సుబ్బులక్ష్మి పదేళ్లక్రితం హైదరాబాద్లోని ఆల్వాల్లో ‘సుబ్బులక్ష్మి నృత్య కళాశాల’ను స్థాపించింది. దీనిద్వారా ఎందరో శిష్యులకు భరతనాట్యంలో శిక్షణ ఇచ్చిందామె. ‘పిల్లల్లో ఆసక్తిని పెంచడానికి మధ్యలో చిన్నచిన్న పిట్ట కథలు చెప్పేదాన్ని. అలా కథలు చెబుతూ నాట్యాన్ని నేర్పిస్తుంటే పిల్లలు చాలా ఇష్టంగా నేర్చుకునేవారు.
నిజానికి ఈ ఐడియా నాది కాదు. మావారిది. మా పెద్దపాప పుట్టినప్పుడు తనని నిద్రపుచ్చడానికి కథలు చెబుతుంటే అది విన్న మావారు ‘నువ్వు గొప్ప స్టోరీ టెల్లర్వోయ్’ అంటూ ఇచ్చిన కితాబు నాపై మంత్రంలా పనిచేసింది. అంతకుముందు ఇంట్లో అసువుగా నేను చెప్పే కథలు విన్న మా అన్నయ్య కూడా ఇదే మాట అనేవాడు. ఆ తర్వాత నుంచీ నాట్యాన్ని, కథని కలిపి చెప్పడం మొదలు పెట్టాను. దీనికోసం కొన్ని నైపుణ్యాలని కూడా నేర్చుకున్నాను. మొదట్లో ఇదో సరదా ప్రక్రియలా మొదలైనా ‘నృత్య కథ’ ద్వారా పిల్లల్లో అనేక సామాజిక సమస్యలపై అవగాహన తీసుకురావడం మొదలుపెట్టాను.
తరగతిలోకి అడుగుపెట్టిన మరుక్షణమే....పిల్లలు టీచర్ ఈ రోజు కథేంటి అని అడుగుతుంటే నాలో ఉత్సాహం రెట్టింపయ్యేది. అప్పటికప్పుడు సమాజంలో నేను చూసిన సందర్భాలను, సన్నివేశాలను కథలా అల్లి వాళ్లకు చెబుతుంటే వాళ్లు కూడా ఉత్సాహంగా వినేవారు’ అనే సుబ్బులక్ష్మి... కాలేజీ పిల్లలకు ఫిట్నెస్ కోసం జుంబా తరగతులు, మారథాన్లు నిర్వహిస్తుంటారు.
లాక్డౌన్ వేళ....
‘కొవిడ్ కారణంగా ప్రస్తుతం పిల్లలెవరూ బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. ఇలాంటి సమయంలోనే పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని తీసుకురావాలి. అందుకే ఆన్లైన్లో నాట్యకథలు చెప్పడం మొదలుపెట్టాను. గతంలో దేశవిదేశాల్లో ఉన్న నా శిష్యులందరికీ ఆన్లైన్లోనే పాఠాలు చెప్పేదాన్ని. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా. నా నాట్యకథలు వినడానికి విదేశాల్లో ఉండే విద్యార్థులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మన సంస్కృతి పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. రోజుకి నాలుగు నుంచి అయిదు తరగతులు నిర్వహిస్తున్నా. ప్రతి తరగతిలోనూ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉండటం చూస్తుంటే కళ ద్వారా వారికి నా వంతు సాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంద’ని చెబుతున్నారు సుబ్బులక్ష్మి.
ఇదీ చదవండి: రణమున గెలిచారు: కరోనాను జయించిన వారి అనుభవాలివి!