ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని మెయిల్ ఐడీ, సామాజిక మాధ్యమాల ఐడీలను హ్యాక్ చేసి అసభ్య వ్యాఖ్యలను పోస్టు చేసి వేధిస్తున్న ఓ బాలుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని మెయిల్ ఐడీతోపాటు, ఫేస్బుక్ అకౌంట్ గుర్తు తెలియని వ్యక్తి హ్యాక్ చేసి అసభ్య వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నాడు. వాటిని భరించలేక ఆమె పక్కింటి మహిళ సహకారంతో ఫేస్బుక్ అకౌంట్ను బ్లాక్ చేసింది. అయినా.. ఆ అకౌంట్ను యాక్టివేట్ చేసి వేధించేవాడు. మరోవైపు విద్యార్థిని పక్కింటి మహిళ మెయిల్ ఐడీనీ తెలుసుకుని ఆమెకూ పలు వ్యాఖ్యలు పోస్టు చేశాడు. అంతేకాక బాధితురాలు, ఆమె తండ్రి ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాడు. ఆమె ఫొటోలను అంతర్జాలంలో పోస్టు చేస్తానని బెదిరించేవాడు. దీంతో బాధితురాలు గత డిసెంబరు 10న పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతికత సహకారంతో దర్యాప్తు చేసి నిందితుడు ఓ బాలుడిని గుర్తించారు.
చనువుగా మెలిగిన క్రమంలో..
బాధితురాలి పక్కింట్లోనే ఉండే ఆ బాలుడు ఆమెతో చనువుగా ఉండేవాడు. గతంలో ఆమె ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం అకౌంట్స్లో సమస్యలు రావడంతో అతడి సహాయంతో వాటిని డిలీట్ చేయించింది. ఆ సమయంలో ఆమె మెయిల్ ఐడీ పాస్వర్డ్ తెలుసుకున్నాడు. బాధితురాలి మెయిల్ నుంచే ఆమె ఫొటోలనూ తస్కరించాడు. అంతేకాక బాధితురాలి ఇంట్లో వైఫైకి అనుసంధానించిన డివైసెస్ సెక్యురిటీ లాక్, పిన్ నంబర్లను మార్చివేసి గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్లు నమ్మించి వేధించేవాడు. గత నెల 27న బాలుడిని అరెస్టు చేసి బాలల న్యాయస్థానంలో ప్రవేశపెట్టి అబ్జర్వేషన్ హోంకు తరలించారు.