హిందుస్థాన్ షిప్యార్డ్లో 1975 నుంచి ఉన్న క్రేన్లను పదికిపైగా ఇప్పటికీ వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. భద్రతా పరంగా చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. యాజమాన్యం దీనిపై దృష్టి పెట్టడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఏ విభాగంలో క్రేన్ ఎంత లోడ్ ఎత్తాలి అనేది స్పష్టంగా నిర్దేశించాలి. ఎన్ని డిగ్రీల కోణంలో ఎంత బరువు ఏ మేరకు లేపాలి, ఎటువైపు కదలాలి అనేది కూడా ప్రమాణాల మేరకు ఉండాలి. క్రేన్ సకాలంలో నవీకరణ జరుగుతోందా..? లైసెన్స్ నవీకరణ చేస్తున్నారా లేదా అన్నది నిత్యం పర్యవేక్షించాలి. ఈ ప్రమాణాలు పాటించారా లేదా అన్న అంశంపైన హిందుస్థాన్ షిప్యార్డ్ యాజమాన్యం ఇంతవరకు ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వాస్తవంగా ఈ ప్రమాదానికి గురైన ఈ భారీ క్రేన్ దశాబ్దం క్రితం కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అప్పటినుంచి దీన్ని వినియోగంలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అవాంతరాలు ఎదురవుతున్నాయి. 2020లో దీనిని కమిషన్ చేయడానికి గ్రీన్ ఫీల్డ్ కార్పొరేషన్తో షిప్యార్డ్ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. గత రెండు రోజులుగా టెస్టింగ్ జరుగుతోంది. 70 టన్నుల సామర్థ్యం గల 100 అడుగుల ఎత్తు ఉన్న ఈ క్రేన్... లోడ్ టెస్టింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం పొంచి ఉందని చెబుతూనే ఉన్నామని ఉద్యోగులు, కార్మికులు అంటున్నారు.
ఇదీ చదవండీ... పనిచేసే చోటే కబళించిన మృత్యువు