Top 100 NGOs :విజయవాడకు చెందిన తరుణ్ చెరుకూరి(35) స్థాపించిన ఇండస్యాక్షన్ సంస్థ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో సమాజహిత కార్యక్రమాలను చేపడుతున్న టాప్ 100 స్వచ్ఛంద సంస్థల జాబితాలో చోటు దక్కించుకుంది. ది గ్రో ఫండ్ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలకు చేయూత ఇచ్చేందుకు దేశంలోని టాప్ 100 జాబితాను ఎంపిక చేశారు. ఈ వంద సంస్థలకు వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్ల నిధులను సేకరించి ది గ్రో ఫండ్ సంస్థ ఇవ్వనుంది. దిల్లీ కేంద్రంగా 2013లో ఇండస్యాక్షన్ సంస్థను తరుణ్ స్థాపించారు.
ప్రైవేటు విద్యా సంస్థల్లో 25శాతం సీట్లను ఉచితంగా పేద విద్యార్థులకు కేటాయించాలంటూ.. కేంద్ర ప్రభుత్వం 2009లో ప్రకటించిన విద్యాహక్కు చట్టం(ఆర్టీఈ) అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఇండస్యాక్షన్ సంస్థ పని చేస్తుంది. దిల్లీ నుంచి ఆరంభించి ఒక్కొక్కటిగా ఇప్పటివరకు 19 రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తూ వచ్చింది. తెలంగాణలోనూ ఇప్పటికే ఇండస్యాక్షన్ సంస్థ పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ప్రస్తుతం ఒప్పందం చేసుకుంది. బిట్స్పిలానీలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన తరుణ్ అనంతరం ఉపకారవేతనంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు.
సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో ఉన్నత కొలువును వదిలేసి మరీ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఇప్పటివరకూ ఇండస్యాక్షన్ ఆధ్వర్యంలో గత ఎనిమిదేళ్లలో 3.3లక్షల మంది పేద పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా చేర్పించారు. దేశ వ్యాప్తంగా 50వేల మందికి పైగా వలంటీర్లు ఇండస్యాక్షన్ సంస్థ తరఫున సేవలు అందిస్తున్నారు. 2015లోనే తరుణ్కు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఎమర్జింగ్ గ్లోబల్ లీడర్ అవార్డు కూడా వచ్చింది. 2019లో ప్రతిష్ఠాత్మకమైన ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్ అవార్డును కూడా అందుకున్నారు.
ఇదీ చదవండి:
'సీఎం అభ్యర్థి నేనే' అని హింట్ ఇచ్చి.. వెనక్కి తగ్గిన ప్రియాంక
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!