రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో.. ఈనెల 5, 6 తేదీల్లో ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 30 ఆసుపత్రుల్లో పలు అవకతవకలను గుర్తించారు. ఐదు వైద్యశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరో ఆసుపత్రికి కరోనా చికిత్స అనుమతిని రద్దు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని పల్నాడు, అంజిరెడ్డి ఆసుపత్రి యాజమాన్యాలు.. కోవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ తెలిపారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని సుభాషిణి ఆసుపత్రిలో.. ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనాకు చికిత్స చేసేందుకు అనాసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని వేదాంత ఆసుపత్రి యాజమాన్యం.. ప్రభుత్వ అనుమతి లేకుండానే కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని పీవీఆర్ ఆసుపత్రిలోనూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దారి మళ్లుతున్నట్టు గుర్తించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న రోగుల వివరాల్లోనూ.. అవకతవకలు ఉన్నట్టు సమాచారం.
ఇదీ చదవండి: కోవిడ్ ఆస్పత్రిలో కార్టూన్ల సందడి
కోవిడ్ బాధితులే స్వయంగా రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బయట నుంచి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించామని ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు తెలిపారు. శ్రీకాకుళంలోని సూర్యముఖి ఆసుపత్రిలో వీటి వినియోగంలో అవకతవకలు, బిల్లులు లేకుండా విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఐదు వైద్యశాలలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు విజిలెన్స్ డీజీ తెలిపారు. కడపలోని సిటీకేర్ ఆసుపత్రి యాజమాన్యం కరోనాకు వైద్యం చేసి బిల్లులు ఇవ్వకపోవడంతో.. చికిత్సకు అనుమతి రద్దు చేశామన్నారు. ఆరు ఆసుపత్రులపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి:
కోవిడ్ వైద్య చికిత్సలపై హైకోర్టులో విచారణ.. సర్కార్ తీరుపై అసంతృప్తి!